హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 41 సీఆర్పీసీ ప్రకారం నోటీస్ ఇవ్వకుండానే రాజాసింగ్ను అరెస్టు చేశారని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. న్యాయవాదుల వాదనతో కోర్టు ఏకీభవించింది. దీంతో రాజాసింగ్ విడుదలకు నాంపల్లి కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు నాంపల్లి కోర్టు మొదట 14 రోజుల రిమాండ్ విధించిన విషయం విదితమే. అయితే రాజాసింగ్ న్యాయవాదుల వాదన అనంతరం ఆయన రిమాండ్ను కోర్టు తిరస్కరించింది. ఇక నాంపల్లి కోర్టు వద్ద రాజాసింగ్ అనుచరులు హంగామా సృష్టించారు. కోర్టు వద్ద అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. పోలీసులు లాఠీలకు పని చెప్పారు.