సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): మాజీ మావోయిస్టు శేషన్నను గోల్కొండ పోలీసులు బుధవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన శేషన్న చాలా కాలం గ్యాంగ్స్టర్ నయీమ్కు ప్రధాన అనుచరుడిగా పనిచేశాడు. షేక్పేట్ క్రాస్రోడ్డులో మంగళవారం గోల్కొండ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా పిస్టల్తో చిక్కడంతో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పలు హత్య కేసుల్లో శేషన్న నిందితుడిగా ఉన్నాడు.
కోవర్టు ఆపరేషన్లు చేయడంలోనూ శేషన్న దిట్ట. శేషన్నకు 1993లో నయీమ్తో జైల్లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో ఇద్దరు బయటకు వచ్చి పలు సెటిల్మెంట్లు, హత్యలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత శేషన్న అజ్ఞాతంలోకి వెళ్లాడు. మంగళవారం పట్టుబడిన అతడిని బుధవారం కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. అయితే, శేషన్నను తదుపరి విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో పోలీసులు కస్టడీకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అతడిని ప్రశ్నిస్తేనే నయీమ్తో ఉన్న సంబంధాలు.. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత అతడు ఎక్కడు ఉన్నాడు.? ఎవరు షెల్టర్ ఇచ్చారు.? వంటి కీలక సమాచారం పోలీసులు రాబట్టే అవకాశం ఉంది.