బంజారాహిల్స్, ఏప్రిల్ 22: హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నవనిర్మాణనగర్లో ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకునే ప్రయత్నాలపై ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో ‘ ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నం’ పేరుతో మంగళవారం ప్రచురించిన కథనంపై అధికారులు స్పందించారు.షేక్పేట మండల పరిధిలోని సర్వే నెంబర్ 403లోకి వచ్చే జూబ్లీహిల్స్ రోడ్ నెం 1 ప్రధాన రహదారిలోని డీఈ షా సంస్థ భవనం వెనకాల సుమారు 300 గజాల ప్రభుత్వ స్థలంలో అసాంఘిక శక్తులు తిష్ట వేస్తుండటంతో పాటు అక్రమంగా పార్కింగ్లు చేస్తున్నారు. దీంతో స్థానిక నవ నిర్మాణ్నగర్ సొసైటీ పెద్దలు ఈ స్థలంలోకి వెళ్లకుండా గేటు ఏర్పాటు చేయడంతో పాటు ప్లే ఏరియా అంటూ బోర్డులు ఏర్పాటు చేశారు.
రెవెన్యూశాఖకు చెందిన ఈ స్థలాన్ని సొసైటీ కోసం ప్లే జోన్గా మార్చడం కోసం ఎలాంటి అనుమతులు లేకుండా ప్రయత్నాలు చేస్తున్నరనే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మంగళవారం షేక్పేట మండల తహశీల్దార్ అనితారెడ్డితో పాటు సిబ్బంది నవ నిర్మాణ్నగర్ వెళ్లి ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. అక్రమంగా నిర్మించిన గదిని కూల్చేయడంతో పాటు ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. స్థలంలోకి ప్రవేశించేవారిపై చర్యలు ఉంటాయని, కాలనీవాసులు తాత్కాలికంగా వాడుకోవాలంటే ప్రభుత్వం నుంచి సరైన అనుమతులు తీసుకోవాలని తహశీల్దార్ సూచించారు. కాగా స్థలాన్ని తాము ఆక్రమించడం లేదని, కేవలం దాన్ని రక్షించుకునేందుకే గేటు ఏర్పాటు చేశామని, బయటి వ్యక్తులు రాకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని నవ నిర్మాణ్నగర్ కాలనీవాసులు పేర్కొన్నారు.