సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : వరద ముంపు నివారణకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపడుతున్న నాలా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మీ అధికారులను ఆదేశించారు. ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రూ. 103 కోట్ల వ్యయంతో 9 పనులు చేపడుతున్న నేపథ్యంలో సంబంధిత పనులను మే మాసం చివరి వరకు పూర్తి చేయాలన్నారు. గురువారం ఉదయం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎస్ఎన్డిపి ద్వారా చేపడుతున్న నాలా పనుల ప్రగతిపై ఎమ్మెల్యేతో కలిసి మేయర్ సమీక్షించారు.
సరూర్ నగర్ చెరువు నుంచి వయా జోనల్ ఆఫీస్ మీదుగా చైతన్యపురి వరకు, సరూర్ నగర్ చెరువు నుంచి వయా కోదండ రామ్ నగర్ మీదుగా చైతన్యపురి వరకు చేపట్టే నాలా పనులను ముందుగా అలైన్ మెంట్ చేయగా వాటర్ వర్స్ యుటిలిటీనీ తొలగించే అవకాశం లేని దృష్ట్యా అలైన్మెంట్ మార్పు చేయాలని స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోరారు. సరూర్ నగర్ నుంచి వయా కోదండరాం నగర్ మీదుగా చైతన్యపురి వరకు చేపట్టే పని తిరుమల నగర్ వయా ఠాకూర్ హరి ప్రసాద్ మీదుగా చైతన్యపురి వరకు చేపట్టే పనినీ మార్పు చేసినట్లు అధికారులు మేయర్కు వివరించారు.
సరూర్ నగర్ చెరువు నుంచి వయా జోనల్ ఆఫీస్ మీదుగా చైతన్యపురి వరకు చేపట్టే సాయిబాబా టెంపుల్ నుంచి పనులు వేగిరం చేయాలని మేయర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఈఎన్సీ జియా ఉద్దిన్, సీఈ కిషన్, ఎస్ఈ భాసర్ రెడ్డి, ఈఈ కృష్ణయ్య, డిప్యూటీ ఈఈ వెంకట్ కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.