ఉప్పల్/కాప్రా, మే 8: నాచారంలోని ఈఎస్ఐ హాస్పిటల్లో మరిన్ని బెడ్లు ఏర్పాటు చేసి సేవందించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ శనివారం దవాఖాన ఉన్నతాధికారులకు సూచించారు. హాస్పిటల్ను ఆయన సందర్శించి అక్కడ అందిస్తున్న కొవిడ్ చికిత్సలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్లో 50 మంది కరోనా రోగులు మాత్రమే చికిత్స పొందే అవకాశం ఉన్నందున అదనంగా మరో 350 మందికి చికిత్సలు అందించేలా చర్యలు తీసుకోనున్నట్టు కమిషనర్ తెలిపారు. అందుకు అనుగుణంగా హాస్పిటల్లో సౌకర్యాలను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎన్.శంకర్, పలువురు అధికారులు పాల్గొన్నారు.