హైదరాబాద్: నగరంలోని దమ్మాయిగూడ చిన్నారి మృతి కేసులో మిస్టరీ వీడింది. ఊపిరి తిత్తుల్లో నీరు చేరడంతో ఇందు మృతిచెందిందని వైద్యులు తమ నివేదికలో వెల్లడించారు. జవహర్నగర్కు చెందిన ఇందు.. ఈ నెల 15న దమ్మాయిగూడలోని స్కూల్కు వెళ్లి అదృష్యమైంది. మరుసటి రోజు ఉదయం పోలీసులు ఆమె మృతదేహాన్ని దమ్మాయిగూడలోని అంబేద్కర్నగర్ చెరువులో గుర్తించిన విషయం తెలిసిందే.
కాగా, ఇందు.. ప్రమాద వశాత్తు చెరువులో పడి మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. మూత్ర విసర్జన కోసం చెరువు వద్దకు వెళ్లి కాలుజారి పడినట్లు నిర్ధారించారు. ఇక ఇందు మృతిపై అనుమానాలు లేవని పోస్టుమార్టం నివేదికలో వైద్యులు వెల్లడించారు. ఊపిరి తిత్తుల్లో నీరు చేరడంతో ఆమె మరణించినట్లు గుర్తించారు.