సిటీబ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రై ల్వే పట్టాలపై చోటు చేసుకుంటున్న అనుమానాస్పద మరణాల కేసుల్లో రైల్వే పోలీసుల దర్యాప్తు లోతుగా ఉండడం లేదనే విమర్శలు వస్తున్నాయి. జరుగుతున్న ఘటనల వెనుక అసలు కారణాలు వెలికి తీయకుండా దర్యాప్తు నామమాత్రంగా చేస్తూ ఆయా కేసులను క్లోజ్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రైల్వే ట్రాక్లపై జరిగే మిస్టరీ మరణాలలో నిజాలు దాచేస్తున్నారా? అనే సందేహాలు వస్తున్నాయి. రెండు నెలల క్రితం ఘట్కేసర్ రైల్వే ట్రాక్పై సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన విజయారెడ్డి, ఇంటర్ చదువుతున్న తన ఇద్దరు పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడిన విషయం సంచలనం సృష్టించింది.
ఆత్మహత్య జరగానికి కారణాలేమిటీ..? ఇంటర్ చదువుతున్న పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఏం జరిగి ఉంటుందనే విషయాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. పోలీసులు కూడా ఆత్మహత్యల వెనుక బలమైన కారణం ఉండే అవకాశాలున్నాయనే అనుమానాలు వ్యక్తం చేశారు. అయి తే ఈ కేసును రైల్వే పోలీసులు లోతుగా దర్యా ప్తు జరపకపోవడంతో ఏం జరిగిందనేది బయటకు రాలేదనే విమర్శలు వచ్చాయి. ఈ ఘటనతో ఇప్పుడు రై ల్వే పోలీసుల దర్యాప్తు ఎలా జరుగుతుంది, మిగతా కేసుల విషయంలోను ఇలాంటి పరిస్థితులే ఉండే అవకాశాలున్నాయని, రైల్వే పోలీసుల దర్యాప్తుపై సామాన్య ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పైపైనే దర్యాప్తులు
రైల్వే ట్రాక్పై జరిగే నేరాలు, ఘోరాల కేసులను హైదరాబాద్తోపాటు పరిసర ప్రాంతాల్లో సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తుంటారు. రైల్వే ట్రాక్లపై అనుమానాస్పద మరణాలు, ప్రమాదాలు, హత్యలు ఇలా పలు ఘటనలు జరుగుతుంటాయి. ఆత్మహత్యల కేసులను ఆనుమానాస్పద కేసులుగా నమోదు చేస్తూ నిజా నిజాలు వెలుగులోకి తెచ్చి దర్యాప్తును పూర్తి చేస్తుంటారు. అయితే ఈ దర్యాప్తులపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైల్వే ట్రాక్లపై జరిగే ప్రమాదాలు కొన్ని మాత్రమే సంచలనంగా మారుతుంటాయి, మరికొన్ని అంతగా వెలుగులోకి రాని కేసులుంటాయి, ఇంకా కొన్ని కే సులు గుర్తుతెలియని మృతదేహాలుగానే ఉంటాయి. ఇలా అన్ని కేసుల్లో లోతైన దర్యాప్తు జరిపితే అసలు కారణాలు బయటకు వస్తాయి. అయితే రైల్వే పోలీసులు ఆయా కేసులను తేలికగా తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.
సెటిల్మెంట్ ఆరోపణలు!
సంచలనం సృష్టించిన విజయారెడ్డి కేసును కూడా ముగించేందుకు రైల్వే పోలీసులు సన్నాహాలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రైల్వే పోలీసులను కలిసిన మృతురాలి భర్తకు సెటిల్ చేసుకోమంటూ రైల్వే పోలీసులు సలహా ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. సెటిల్మెంట్ అంటే ఏమిటీ..? అన్ని కేసుల్లోనూ ఇలాగే సెటిల్మెంట్ చేసుకోమంటారా? ఇతర కేసుల్లో ఎన్ని సెటిల్ చేశారు..? ఇలా ఎన్నో సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. రైల్వే పోలీసులు సామాన్య ప్రజలకు దూరంగా ఉంటూ కేసులు చూసుకుంటారు, అయితే ఎవరు పట్టించుకోరనే ఉద్దేశ్యంతో దర్యాప్తులు సరిగ్గా చేయ డం లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విజయారెడ్డి కేసులో రైల్వే పోలీసులపై పలు ఆరోపణలు వస్తున్నాయి, ఇలాంటి ఆరోపణలు ఇతర కేసులలోను లేకపోలేదని ప్రజలలో చర్చ జరుగుతున్నది.