సిటీబ్యూరో, నవంబర్ 3(నమస్తే తెలంగాణ): నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో క్షేత్ర స్థాయిలో పోలీస్ సిబ్బంది తీసుకోవాల్సిన బందోబస్తు జాగ్రత్తలపై శుక్రవారం రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ సిబ్బందికి ఆన్లైన్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఎస్ఐలు, ైప్లెయింగ్ స్కాడ్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ ఇతర సిబ్బంది ఉన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎన్నికల విధులకు సంబంధించిన నిర్ధిష్టమైన సూచనలను తమ కిందిస్థాయి సిబ్బందికి అందించాలని, క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే కిందిస్థాయి సిబ్బందికి కూడా ఎన్నికల నిబంధనల మీద పరిజ్ఞానం, అవగాహన కల్పించడానికి ఆయా సిబ్బందితో అంతర్గత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని అధికారులకు ఆదేశించారు.
అవసరమైన చోట్ల చెక్పోస్టులను ఏర్పాటు చేసి అక్రమంగా తరలిస్తున్న డబ్బు, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఆయా రాజకీయ పార్టీలు తరలించే సామాగ్రిని అడ్డుకోవాలన్నారు. పరిమితికి మించిన అక్రమ నగదును ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సమక్షంలో సీజ్ చేయాలని సూచించారు. అత్యవసరంగా ఉన్న పోలింగ్ స్టేషన్ ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు, మౌలిక సదుపాయాలు ఏర్పాట్లను ముందుగానే చూసుకోవాలన్నారు. ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సిబ్బందికి దిశా నిర్ధేశం చేశారు. ఎన్నికల సమయంలో సోషల్ మీడియాపై నిఘా ఉంచాలని, శాంతి భద్రతల సమస్యలను సృష్టించేందుకు అవకాశమున్న సోషల్ మీడియా సందేహాలు, వీడియోలు వైరల్ చేసే అవకాశాలుంటాయని, ఉన్నతాధికారులకు ఇలాంటి విషయాలపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమావేశంలో అదనపు సీపీ తరుణ్ జోషీ, డీసీపీలు దరావత్ జానకి, ఇందిరా, అదనపు డీసీపీలు శ్రీనివాస్రెడ్డి, రఫీక్ తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్, నవంబర్ 3(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అబ్జర్వుర్లు, వ్యయ పరిశీలకుల అధికారులను నియమించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ శుక్రవారం వెల్లడించారు. శాసనసభ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల సంఘం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు ప్రత్యేకంగా నియమించినట్లు పేర్కొన్నారు. మేడ్చల్ నియోజకవర్గానికి అబ్జర్వర్లు(పరిశీలకులు) ఎస్.కె.జైన్, మల్కాజిగిరి, ఉప్పల్లకు పూర్వాగార్గ్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాలకు అమన్ మిట్టల్లను నియమించగా, వ్యయ పరిశీలకులుగా మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్లకు ప్రేమ్ ప్రకాశ్ మీనా, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాలకు నాగ్వే బాలాసాహెబ్ బాపూరావుల నియమించినట్లు కలెక్టర్ గౌతమ్ వివరించారు.