Hyderabad | రోడ్డెక్కాల్సి వస్తున్నది’.. మూసీ బాధితుల ఆవేదన ఇదీ.. మూసీ పేరిట కాంగ్రెస్ చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కేవలం పేదల భూములే లక్ష్యంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టుతో వేలాది కుటుంబాలు రోడ్డున పడనున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో మూసీ బాధితులు ఇటీవల చర్చావేదిక నిర్వహించారు. ఇందులో మహిళలు తమ ఆవేదనను వ్యక్తం చేయగా, ఇప్పుడా అంశంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. కేవలం పేదల ఇండ్లకే బఫర్ జోన్ వర్తిస్తుందా? మూసీ వెంబడి నిర్మించే ఆకాశ హర్మ్యాలకు వర్తించదా? అంటూ మొదలుపెట్టిన ప్రశ్నలు ఎంతో మంది మూసీ బాధితులను కదిలిస్తున్నాయి.
ముఖ్యంగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ నగరానికి కోడలిగా వచ్చిన ఓ మహిళ ఆవేదన ఎంతో మందిని కలవరపెడుతున్నది. కేవలం మూసీ ప్రక్షాళనతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర లేపిన సర్కారు.. నిబంధనల విషయంలో అనుసరిస్తున్న పక్షపాత వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రజా సంఘాలు, పర్యావరణ, సామాజిక కార్యకర్తలతోపాటు, పెద్ద ఎత్తున మూసీ బాధితులు హాజరైన ఈ కార్యక్రమంలో పలువురు లేవనెత్తిన అంశాలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తేతెలంగాణ) : మూసీ ప్రక్షాళన పేరిట కాంగ్రెస్ సర్కారు పేదలను రోడ్డున పడేస్తున్నదని మండిపడ్డారు. ఎలాంటి డీపీఆర్ లేకుండా, ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా భారీ ప్రాజెక్టును ఎలా చేపడుతున్నారనే అంశం ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలింది. సీఎం రేవంత్రెడ్డి చట్టసభల్లో చెప్పే మాటలకు, బయట జరుగుతున్న పనులకు ఏమాత్రం పొంతన లేదన్నారు. ప్రభుత్వం ఏడీబీ నుంచి లోన్ వచ్చిందనీ, మూసీ పనులు మొదలుపెడుతున్నామని వ్యాఖ్యానించింది. కానీ ఏడీబీ అధికారులు మాత్రం ఇప్పటివరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రజా సంఘాలు రాసిన లేఖ ద్వారా వివరించారు. కానీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి ప్రపోజల్ వస్తే ఏడీబీ వాళ్లు దాని పరిశీలించారన్నారు. మూసీ వంటి పెద్ద ప్రాజెక్టుకు డీపీఆర్ లేదని, ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముక్కలు ముక్కలుగా చూపిస్తూ ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నదని బాధితులు వాపోయారు.
కాంగ్రెస్ నేతల ఇండ్లు ముట్టడిస్తాం
మూసీ జోలికిగానీ, పరివాహాక ప్రాంతంలో ఉండే పేదలను రోడ్డున పడేసేలా కాంగ్రెస్ సర్కారు వ్యవహారిస్తే… కాంగ్రెస్ నాయకుల ఇండ్లను ముట్టడిస్తామని ప్రజా సంఘాల నాయకులు బిలాల్ వివరించారు. ఎలాగైతే రైతుల ఆందోళనలు, నదుల పరిరక్షణకు ఆందోళనలు జరిగాయో అలా కాంగ్రెస్ నాయకుల ఇంటి ముందు నిలబడి నిరసనలు చేస్తామన్నారు. మూసీ పరివాహాక ప్రాంతంలో ఉండే ప్రజలను పంపించడానికి ప్రయత్నించిన చంద్రబాబుతోనే కాలేదన్నారు. మూసీ భూములను అంబానీ, అదానీలకు కట్టబెట్టాలని అప్పటి చంద్రబాబు, ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారని మూసీ బాధితులు ఆరోపించారు. ఇక హైదరాబాదీ కోడలిగా వచ్చిన ఓ మహిళ మాట్లాడుతూ… భూముల కోసం రోడ్డెక్కిన రైతుల తరహాలో, సొంతిండ్ల కోసం పోరాటాలు చేసే పరిస్థితి తెలంగాణకు వచ్చిందనీ హెచ్చరించారు.
టీడీఆర్ బాండ్లతో జారీ…
సుందరీకరణ పేరుతో మూసీ నదీ పరీవాహాక ప్రజల్ని రోడ్డుకీడుస్తున్న రేవంత్ సర్కారు… నదీ హద్దులు, బఫర్ జోన్, మ్యాపులను రహస్యంగా ఎందుకు దాచిపెడుతుందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా భూములు ఎలా తీసుకుంటారని, పరిహారాన్ని టీడీఆర్ బాండ్ల రూపంలో ఇస్తామని ఎలా ప్రకటిస్తారని వ్యాఖ్యానించారు. ఇంతవరకు డీపీఆర్ ఏ దశలో ఉందనే విషయాన్ని కూడా చెప్పలేదన్నారు. ఒక్క మాస్టర్ ప్లాన్కి కూడా ప్రజల నుంచి ఎటువంటి అభిప్రాయ సేకరణ జరగలేదన్నారు. బాండ్ల జారీ చేయడంపై స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందనీ, మూసీ హక్కులను పరిరక్షించడానికి మూసీ జన్ ఆందోళన్ ఏర్పాటు జీవో 921తో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఉందనీ పర్యావరణవేత్తలు మండిపడిన వీడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.