సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ): అది ఒకప్పుడు స్వచ్ఛమైన తాగునీటితో ప్రవహించిన జీవనది మన మూసీ. ఎక్కడో అనంతగిరి కొండల్లో పుట్టిన ఈసీ నదిని తనలో కలుపుకొని ముచుకుందగా కృష్ణానదికి ఉపనదిగా ప్రవస్తున్నది. కానీ పరాయిపాలనలో ఆ నదిపై జరిగిన విధ్వంసంతో రసాయన వ్యర్థాలతో పాటు భారీ లోహాలతో నిండి విషపు నీటితో పరుగులు పెడుతున్నది. నగరంలోని మురుగునంతా శుద్ధి చేయకుండానే మూసీ నదిలోకి మళ్లించడంతో నది కాస్త మురికి కాలువగా మారి దాని పరీవాహక ప్రాంత ప్రజలకు ఊపిరి ఆడనంత ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి విధితమే. కానీ కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మూసీలో ఉన్న మురుగునీటి చీ(పీ)డ వదులుతున్నది.భారీ వర్షాల కారణంగా హిమాయత్సాగర్ గేట్లు ఎత్తడంతో ముసీలో మురుగు కొట్టుకుపోయి పరీవాహక ప్రాంత ప్రజలకు కొత్త ఊపిరి అందుతున్నది. అలాగే నీటిలో జీవ ఆక్సిజన్ రేటు గణనీయంగా వృద్ధి చెందిందని, జలచరాలకు కూడా ఊపిరాడుతోందని అధికారులు పేర్కొంటున్నారు.
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అత్యాధునిక హంగులతో వాకింగ్ ట్రాక్లు, ఆహ్లాదాన్ని పంచే ఆకుపచ్చని అందాలను నింపడంతో ఇప్పుడు మూసీ పరీవాహక ప్రాంతాల్లో దుర్వాసనలు తగ్గడంతో గతానికి భిన్నంగా పరీవాహక ప్రాంతాల్లో సందర్శకుల రద్దీ పెరుగుతుంది. గతంలో అనేక ప్రభుత్వాలు మూసీ అభివృద్ధి, మురుగునీటి శుద్ధి పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసినా.. అది వృథాప్రయాసే అయ్యింది. కానీ రెండేండ్లుగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తోడు భారీ వర్షాలతో వరదలు రావడంతో మూసీలో మురుగును పరుగులు పెట్టించాయని చెప్పవచ్చును.
నగరంలో సుమారు 50-55 కిలోమీటర్ల మేర మూసీనది ప్రవహిస్తున్నది.ముఖ్యంగా లంగర్హౌజ్-బాపూఘాట్, ఎంజీబీఎస్, పురానాపూల్, చాదర్ఘాట్, ముసారాంబాగ్, నాగోల్ తదితర ప్రాంతాల్లో మూసీ ఘాటువాసనలు ఎంత తీవ్రంగా ఉండేవో నగర ప్రజలకు సుపరిచితమే. వరదలకు తోడు హిమాయత్సాగర్ గేట్లు ఎత్తి 1050 క్యూసెక్కుల నీటిని ఈసీ నది నుంచి మూసీ నదిలోకి వదులుతుండటంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం మూసీ కడిగినట్లుగా కనిపిస్తున్నదని నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదనుగా భావించి మురుగునీటి శుద్ధిపై జలమండలితో పాటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరింత దృష్టి సారించి ఉన్న ఎస్టీపీలను బలోపేతం చేయడంతో పాటు కొత్తగా ఎస్టీపీలను ఏర్పాటు చేసి వచ్చిన ప్రతి చుక్కను శుద్ధ్ది చేయగలిగితే.. భవిష్యత్లో మూసీని మురుగు నీరు శాశ్వతంగా వదలడంతో పాటు ఒకప్పటి స్వచ్ఛమైన ముచుకుందలా మన మూసీ నది మారనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.