మెహిదీపట్నం, నవంబర్ 13: ఆర్థిక అవసరాలు, సరదాలు, సౌకర్యాలు, అంతకు మించి వివాహేతర సంబం ధం మొదలైనవి ఒక చిన్నారిని బలి తీసుకున్నాయి. సమాజానికి విరుద్ధంగా భార్యాభర్తలు చేసిన దుర్ఘటనల కారణంగా ఇల్లు, కుటుంబం చిన్నా భిన్నమైంది. భర్త జైలు పాలు కాగా, భార్యకు ముగ్గురు పిల్లల భారం మోయలేనిదైంది. అడపాదడపా పని చేస్తూ భార్య పిల్లల భారాన్ని గాలికి వదిలేసి బజారునపడింది. పిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. గుర్తుకు వచ్చినప్పుడే ఇల్లు, లేకపోతే ఎక్కడోలా.. మిగిలిపోయింది ఆ కుటుంబం. 22 యేళ్ల వయసులో తాగుడుకు బానిసై అక్రమ సంబంధం పెట్టుకొని, కొత్తగా ఏర్పడిన బంధాలకు, విసుగు కలిగించేలా నాలుగేళ్ల కూతురు మాటలు ఉండటంతో కొట్టి కొట్టి చంపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నా యి. గుర్తు తెలియని నాలుగేళ్ల బాలిక హత్య కేసు మిస్టరీని పంజాగుట్ట పోలీసులు సాంకేతిక సాధనాల ఆధారంగా ఛేదించారు. హత్యకు పాల్పడ్డ తల్లిని, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసి శనివారం రిమాండ్కు తరలించారు. ఈ మేరకు పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయంలో జాయింట్ కమిషనర్, డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ రావు హ త్య కేసు వివరాలను వెల్లడించారు. మియాపూర్ హఫీజ్పేట్కు చెందిన మహ్మద్ అహ్మద్, హీనాబేగం(22)దంపతులు. వీరికి ఏడేళ్ల అఫాన్, నాలుగేళ్ల మహేక్, మూడేళ్ల మహెరాలు సంతానంగా ఉన్నారు.
ఇదిలా ఉండగా, దొం గతనాల కేసులో భర్త మహ్మద్ అహ్మద్ జైలుకు వెళ్లాడు. దీంతో హీనాబేగం ఇండ్లలో పనులు చేస్తూ పిల్లలను పోషిస్తుంది. ఈ క్రమంలో కల్లు తాగడానికి షేక్పేట్ కల్లు కంపౌండ్కు వెళ్లేది. అక్కడ ఆమెకు డబీర్పురాకు చెందిన షేక్ మహ్మద్ ఖాదర్ అలియాస్ రిజ్వాన్(25)తో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త వీరి మధ్య అక్రమ సంబంధానికి దారి తీసింది. ఆమెతో పాటు పిల్లలను పోషిస్తానని హామీ ఇచ్చి, పెళ్లి చేసుకుందామని రిజ్వాన్, హీనా బేగానికి మాటిచ్చాడు. దీంతో పిల్లలను తీసుకుని వీరిద్దరు ముంబై, ఢిల్లీ, జైపూర్, మనాలి ప్రాంతాలల్లో తిరుగుతూ జీవిస్తున్నారు. అక్కడ భిక్షాటన చేస్తూ జీవిస్తున్న వీరు హీనా బేగం పెద్ద కూతురు నాలుగేళ్ల మహేక్ను భిక్షాటన చేయాలని కొట్టేవారు. వీరి బాధలు భరించలేని బాలిక తన తండ్రి వద్దకు పోతానని అంటుండేది. ఈ మాటలు వారికి ఇబ్బందిని కలిగించేవి. తమ అక్రమ సంబంధానికి బాలిక అడ్డుగా ఉంటుండటంతో బాలికను తీవ్రంగా కొట్టారు. బెంగుళూరులో ఈ నెల 3వ తేదీ రాత్రి పాపను తీవ్రంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అక్కడి నుంచి పాపను బస్సులో తీసుకుని నగరానికి చేరుకున్నారు. బెంగుళూరు నుంచి బస్సులో ప్రయాణం చేస్తుండగానే పాప చనిపోయినట్లు గ్రహించారు. దీంతో పాప మృతదేహాన్ని పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రి పరిసరాలలో పడేస్తే తమ మీద ఎవరికీ అనుమానం రాదని పంజాగుట్టలో ఇంటి వద్ద ఫుట్పాత్పై పాప మృతదేహాన్ని పడేసి వెళ్లారు. నాలుగో తేదీన ఉదయం పోలీసులకు బాలిక మృతదేహం దొరికింది. కేసును నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ నిరంజన్రెడ్డి పంజాగుట్ట ఏసీపీ గణేష్ పర్యవేక్షణలో అన్నీ కోణాల్లో విచారించి సీసీ కెమెరాల ఆధారంగా బాలిక హత్యకేసు మిస్టరీని ఛేదించారు. కేసును ఛేదించిన పంజాగుట్ట పోలీసులను జాయింట్ కమిషనర్, డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ అభినందించారు.