జవహర్నగర్, సెప్టెంబర్ 14 : కూలీ పనుల కోసం వెళ్లిన ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం… మహబూబ్నగర్కు చెందిన ప్యాటల మహదేవ, అతడి భార్య సుజాత(35)తో కలిసి బతుకుదెరువు నిమిత్తం వచ్చి బాలాజీనగర్లోని బజరంగ్కాలనీలో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. అయితే భార్యాభర్తలిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోశిస్తున్నారు. ఈ నెల 11న సుజాత కూలీ పనుల నిమిత్తం వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు.
దీంతో భర్త మహదేవ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ నెల 11న అదృశ్యమైన సుజాత దివ్యాంగులకాలనీ సమీపంలోని అటవీ ప్రాంతంలో మంగళవారం శవమై కనిపించింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మల్కాజిగిరి డీసీసీ రక్షితామూర్తి, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, జవహర్నగర్ సీఐ భిక్షపతిరావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
కూలీ పనుల కోసం అడ్డా వద్దకు వచ్చిన సుజాతను ఓ వ్యక్తి బైక్పై పనికి తీసుకువెళ్లినట్లు స్థానికులు తెలిపారు. మహిళ మృతిచెంది మూడు రోజులవుతుందని పోలీసులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్ట నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తలరించారు. జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో వారం రోజుల వ్యవధిలో అదృశ్యమైన ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురవ్వడంతో స్థానికులు భయాందోళన గురవుతున్నారు. పోలీసులు సీసీ పుటేజీల అధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు.