బోయిగూడ ఘటనతో బల్దియా అప్రమత్తం
రంగంలోకి ప్రత్యేక బృందాలు
సిటీబ్యూరో, మార్చి 28 : అనధికార గోదాంలపై ఉక్కుపాదం మోపాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇటీవల బోయిగూడలోని స్క్రాప్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ యంత్రాంగం ఖైరతాబాద్, చార్మినార్, ఎల్బీ నగర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి జోన్ల పరిధిలో అనుమతి లేని గోదాంలపై క్షేత్రస్థాయి తనిఖీలకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో సుమారు 23 వేల గోదాంలు ఉండగా, వాటిలో రసాయన గోదాంలు ఆరు వేలు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు. అనుమతి లేని గోదాంలు సుమారు 8, 500 ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు సర్వే చేపడుతున్నారు. వచ్చే మూడు రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నామని, అదే సమయంలో జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన స్క్రాప్ గోదాంలకు నోటీసులు జారీ చేసి.. పూర్తి స్థాయిలో తొలగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
నిలకడగా బాధితుడి ఆరోగ్యం
బన్సీలాల్పేట్, మార్చి 28 : బోయిగూడలో జరిగిన అగ్నిప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ప్రేమ్కుమార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని వైద్యులు తెలిపారు. తొలుత గాంధీలో చికిత్స అందించాక.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలతో బాధితుడిని కంచన్బాగ్లోని డీఆర్డీవో అపోలో దవాఖానకు మార్చారు. కాలిన గాయాలకు అక్కడ చికిత్స అందిస్తున్న వైద్యులు.. సోమవారం గొంతుకు చిన్న సర్జరీ నిర్వహించారు.