మేడ్చల్, మేడ్చల్ రూరల్/ఘట్కేసర్/మేడ్చల్ కలెక్టరేట్/జవహర్నగర్/మేడ్చల్, జూన్10(నమస్తే తెలంగాణ): : నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకవర్గం, అధికారులు సమావేశమై, తెలంగాణ రాష్ట్రంలో సాధించిన ప్రగతి, ప్రజలకు చేరువైన సేవల గురించి చైర్పర్సన్లు మాట్లాడారు. సీఎం కేసీఆర్ కృషితో జరిగిన పట్టణాల అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు జరిగిన మేలును వివరించారు. మేడ్చల్ మున్సిపాలిటీలో చైర్పర్సన్ మర్రి దీపికానర్సింహారెడ్డి అధ్యక్షతన సుపరిపాలన దినోత్సవం జరిగింది. కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులతో జరిగిన సమావేశంలో చైర్పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన పదేండ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. పట్టణ ప్రగతి, హరితహారం, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, కేసీఆర్ కిట్ తదితర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. మంత్రి మల్లారెడ్డి సహకారంతో పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ రమేశ్, కమిషనర్ త్రిల్లేశ్వర్రావు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో సుపరిపాలన దినాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాము లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీల్లో సుపరిపాలన దినోత్సవాన్ని చైర్పర్సన్లు పావనీజంగయ్యయాదవ్, కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజలకు అందిస్తున్న సేవలను వివరించారు.గతంలో వివిధ రకాల సేవల్లో చాలా జాప్యం జరిగేదని, పారదర్శకత ఉండేది కాదన్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో ఏ పని అయినా త్వరగా జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కమిషనర్లు సురేశ్, వేమన రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు పాలొన్నారు. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలలో సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు చంద్రారెడ్డి, వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, కమిషనర్లు ఎ.వాణి రెడ్డి, స్వామి, వైస్ చైర్మన్లు మల్లేశ్యాదవ్, నరేందర్ రెడ్డి, మేనేజర్లు చంద్రశేఖర్, రమేశ్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. జవహర్నగర్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ మేకల కావ్య ఆధ్వర్యం లో కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఉద్యోగులను సన్మానించారు.కమిషనర్ రామలింగం, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్రెడ్డి, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ ఆర్వో ప్రభాకర్యాదవ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో మేయర్ జక్కా వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు. సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో పరిపాలనా రంగం విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పరిపాలనను సుసంపన్నం చేసేందుకు పంచాయతీలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, కొత్త జిల్లాలు, మున్సిపాలిటీలు ఏర్పాటు చేశారని తెలిపారు. అనంతరం కార్పొరేటర్లను, పోలీస్, రెవెన్యూ, జలమండలి అధికారులను సన్మానించారు. కార్యక్రమంలో కమిషనర్, కార్పొరేటర్లు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.