సిటీబ్యూరో, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ): వ్యర్థాల నుంచి వెలుగులు ప్రసరింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో మరొకటి త్వరలో అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే జవహర్నగర్ డంపింగ్ యార్డులో 20 మెగావాట్ల ప్లాంటు అందుబాటులోకి రాగా.. వచ్చే వారంలో దుండిగల్లో 14.5 మెగావాట్ల సామర్థ్యంతో మరో ప్లాంటును పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. చెత్త నుంచి కరెంటును ఉత్పత్తి చేసే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఒక్కొక్కటిగా అందుబాటులోకి తీసుకువచ్చి వ్యర్థాల నుంచి సంపదను సృష్టిస్తున్నది. ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను సెకండరీ కలెక్షన్, ట్రాన్స్ఫర్ పాయింట్స్ (ఎస్సీటీపీ) నుంచి వ్యర్థాలను జవహర్నగర్ డంప్ యార్డుకు తరలిస్తారు.
అకడ యాంత్రికంగా సెగ్రిగేట్ చేసిన తర్వాత మండే గుణం గల వ్యర్థాలను వేరు చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఇందులో భాగంగా ఇప్పటికే జవహర్నగర్ డంపింగ్ యార్డులో 20 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంటు అందుబాటులోకి వచ్చింది. తాజాగా దుండిగల్లో రోజుకు 1500 టన్నుల చెత్త ద్వారా 800 టన్నుల ఆర్డీఎఫ్ ఉత్పత్తి చేయనున్నారు. తర్వాతి దశలో జవహర్నగర్ ఫేజ్-2, ఫ్యారానగర్, యాచారం, బీబీ నగర్లో ఎనర్జీ ప్లాంట్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు.