బేగంపేట, జనవరి 20 : కిమ్స్ వైద్యశాలలో మూలుగ మూల కణం మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. డాక్టర్ నరేందర్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జాంబియా రాజధాని లుసాకాకు చెందిన 14 ఏండ్ల బాలుడు సికిల్సెల్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి వచ్చినవారిలో రక్తం తగ్గిపోవడం, విపరీతమైన కీళ్ల నొప్పులతో దైనందిన పనులు చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. అటువంటి స్థితిలో జాంబియాలో వైద్య సదుపాయాలు లేకపోవడం, కిమ్స్ వైద్యుల గురించి తెలుసుకున్న బాలుడి తండ్రి.. ఇక్కడికి వచ్చారు.
సహజంగా మూలుగ మూల కణం దాతలు ఎవరూ ముందుకు రారు. బాలుడి చెల్లెలు తన అన్నకి మూలకణం ఇచ్చేందుకు ముందుకు రావడంతో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. మూల కణం దానం చేసిన చెల్లెలు కూడా సికిల్సెల్ వ్యాధిగ్రస్తురాలేనని, అయితే బాలికకు వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నదని, అతి తీవ్ర స్థాయి నుంచి బాలుడు కూడా ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకుంటాడని వైద్యులు తెలిపారు.