Manda Krishna Madiga | కంటోన్మెంట్, ఏప్రిల్ 15: కాంగ్రెస్ పార్టీ మాదిగలను మోసం చేసిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. సోమవారం కంటోన్మెంట్లోని రాయల్ లీ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ 2004 -14 మధ్య కాలంలో ఎస్సీ వర్గీకరణ హామీ ఇచ్చింది తప్ప అమలు చేయలేదన్నారు.
రాహుల్ గాంధీ, సోనియా గాంధీని ఎస్సీ వర్గీకరణ కోసం ప్రైవేట్ బిల్లు పెట్టమని పలుమార్లు కలిసిన ఫలితం లేకుండా పోయిందన్నారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నామని చెప్పిన కాంగ్రెస్ ఎంపీ, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మాదిగలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. ఓటు రూపంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్ పెద్దపీట వేస్తుందని, సీఎం రేవంత్రెడ్డి వర్గీకరణ విషయంలో స్పష్టంగా లేరని దుయ్యబట్టారు. పార్లమెంట్లో మాదిగలకు ప్రాతినిధ్యం లేకుండా చేసిందే కాంగ్రెస్ పార్టీ అని, మాదిగలను చట్ట సభలకు వెళ్లే స్థాయి నుంచి కింది స్థాయి పదవులు ఇస్తామనడం అవమానకరమన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ కంటోన్మెంట్ ఇన్చార్జి ఇటుక శ్రీకిషన్ మాదిగ, నేతలు అజిత్ కళ్యాణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.