బడంగ్పేట, నవంబర్ 28 : కాంగ్రెస్, బీజేపీలు బయటకు మాత్రమే శత్రువులుగా కనిపిస్తాయి కానీ.. రెండు పార్టీలు ఒక్కటేనని, వారి మధ్యన చీకటి ఒప్పందం ఉన్నదని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మైనార్టీల అభివృద్ధికి చేసింది శూన్యమన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధి షాహిన్నగర్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఎంఐఎం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఎంపీ అసద్దుదీన్ ఒవైసీ హాజరై ప్రసంగించారు. మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి పటోళ్ళ సబితా ఇంద్రారెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. మైనార్టీల సంక్షేమానికి బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తున్నదని, జల్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారని తెలిపారు. ఐటీ సంస్థల ఏర్పాటుతో అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న బీఆర్ఎస్ వైపే నిరుద్యోగులు నిలువాలని పిలుపునిచ్చారు. ఐటీ హబ్లో లక్షల ఉద్యోగాలు వస్తాయని మైనార్టీలకు బరోసా కల్పించారు.
హైదరాబాద్ పేరు మారుస్తామని చెబుతున్న బీజేపీకి ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ విష ప్రచారాలను నమ్మవద్దని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలకు ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వేయవద్దని, రాష్ర్టాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న బీఆర్ఎస్కే ముస్లిం, మైనార్టీలు ఓటు వేయాలని, మహేశ్వరం నియోజకవర్గంలో సబితా ఇంద్రారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అయితేనే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు వేస్తే నగరంలో అలజడి సృష్టించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జల్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ అబ్దులా సాదీ, మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇక్బాల్ ఖలీఫా, ఈసూఫ్ పటేల్, బీఆర్ఎస్ నాయకులు, ఎంఐఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.