సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో సీఎన్జీ వాహనాల సంఖ్యకు తగ్గట్టుగా సీఎన్జీ సరఫరా మాత్రం ఉండటం లేదు. నో స్టాక్ బోర్డులతో బంక్లు దర్శనమిస్తున్నాయి. దీంతో ఇంధన సరఫరా లేకపోతే గిరాకీ రైడ్స్ ఎలా చేయడమంటూ క్యాబ్, ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, నగరంలో సుమారు 5 లక్షల వరకు సీఎన్జీ వాహనాలు ఉన్నాయి.
హైదరాబాద్ పరిధిలో 460 పైగా పెట్రోల్ బంకులు ఉండగా, అందులో 95 స్టేషన్లలో గ్యాస్ పంపులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 25 కేంద్రాల్లో నేచురల్ గ్యాస్ కేంద్రాలు మాత్రమే కొనసాగుతున్నాయి. సాధారణంగా రోజు వారీ డిమాండ్ 3.7లక్షల కిలోలుగా ఉంది. కానీ అందుబాటులో ఉన్నది మాత్రం 1.90 లక్షల కిలోలే. కాగా, నగరంలో ఒక్కో బంక్ స్టేషన్కు 6 వేల కిలోలకు పైగా డిమాండ్ ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ క్రమంలో అందుకు తగ్గట్టు ఇంధన సరఫరా మాత్రం ఉండటం లేదని డ్రైవర్లు వాపోతున్నారు. ‘సీఎన్జీ కొరత కారణంగా చాలా మంది డ్రైవర్లు బండ్లను అధిక సమయం నడపలేకపోతున్నారు.
ముఖ్యంగా రాత్రి సమయాల్లో నిద్దుర మానుకొని వాహనాలన్నీ బంక్ల ముందర ఓవైపునకు నిలుపుతున్నాం. అప్పటికే ఆ బంక్లో నో స్టాక్ అని బోర్డులు ఉంటాయి. కానీ స్టాక్ వస్తదేమోనని గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం స్పందించి వె ంటనే ఇంధన కొరత సమస్యలను పరిష్కరించాలి. ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఉపాధిని కాపాడాలి’ అని నాచారం ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రామాజంనేయులు అన్నారు.