సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ)/చార్మినార్: మాతృభాషకు విధిగా మర్యాదనిస్తూనే పరభాషలను గౌరవించుకోవాలని, మన సంస్కృతికి మాతృభాషే తల్లివేరులా పనిచేస్తుందని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సిటీ కళాశాల తెలుగు విభాగం నిర్వహించిన భాషా సదస్సులో శ్రీదేవి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర సాధన కోసం తెలంగాణలో ఉద్యమకారులు ఎట్లా ప్రాణాలర్పించారో.. ఢాకా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు కూడా తమ మాతృభాష ‘బంగ్లా’ భాష కోసం తమ ప్రాణాలను అర్పించారని చెప్పారు. వారి త్యాగాలకు గుర్తుగా యునెస్కో ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించిందని గుర్తుచేశారు.
తెలుగు భాష, సాహిత్యాల ఆవిర్భావానికి తెలంగాణ ప్రాంతంలోనే మూలాలున్నాయని పరిశోధకులు నిరూపించారని శ్రీదేవి తెలిపారు. తెలుగు భాషా, సాహిత్యాల వికాసానికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి గొప్పదని ప్రశంసించారు. శత వసంతాల సిటీ కళాశాల తన ప్రత్యేకతను ఎప్పటికప్పుడు నిలపుకుంటున్నదని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో సమాచార కమిషనర్ శంకర్నాయక్, ఆచార్య బాలభాసర్, డాక్టర్ కోయి కోటేశ్వరరావు, అవధానం సుజాత, జె.నీరజ, అనంతలక్ష్మి, కేథరీనా, కమల సుధారాణి, శంకర్కుమార్, భాసర్, లతారాణి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
పెన్నాకు ముదిగంటి గోపాల రెడ్డి స్మారక పురస్కారం
ప్రముఖ రచయిత్రి, పరిశోధకురాలు డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి తన భర్త ఆచార్య ముదిగంటి గోపాల రెడ్డి పేరిట నెలకొల్పిన స్మారక పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త ఆచార్య పెన్నా మధుసూదన్కు పూర్వ డీజీపీ, సంస్కృత సాహిత్య పరిశోధకులు డాక్టర్ కె. అరవింద్రావు ప్రదానం చేశారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రాంగణంలో గల ఆడిటోరియంలో ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా పెన్నాను ఘనంగా సత్కరించి పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య, ముదిగంటి సుజాతారెడ్డి , ఆచార్య టి. గౌరీశంకర్ పాల్గొన్నారు.