Hyderabad | హైదరాబాద్ : బేగంపేట పైగా కాలనీలోని ఓ ఇంట్లోకి చొరబడ్డ ఇద్దరు దొంగలను తల్లీకూతుళ్లు ధైర్యంగా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తల్లీకూతుళ్లను నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని శాలువాతో సత్కరించి, సన్మానించారు. దొంగలను ధైర్యంగా ఎదుర్కొన్న తీరును డీసీపీ ప్రశంసించారు.
నవరతన్ జైన్ అనే వ్యక్తి తన భార్య అమిత మేహాతో, కుమార్తెతో కలిసి పైగా కాలనీలో నివాసముంటున్నారు. గురువారం మధ్యాహ్నం 2:15 గంటల సమయంలో మాస్కు, హెల్మెట్ ధరించిన ఇద్దరు వ్యక్తులు.. కొరియర్ వచ్చిందంటూ నవరతన్ జైన్ ఇంటికి వచ్చారు. డోర్ తెరవగానే ఆ దుండగులిద్దరూ నాటు తుపాకీ, కత్తితో బెదిరించి నగదు, ఆభరణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో నవరతన్ జైన్ ఇంట్లో లేరు. అప్రమత్తమైన తల్లీకూతుళ్లు దొంగలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. హెల్మెట్ ధరించిన వ్యక్తిని ఎదురించారు. అతని వద్ద ఉన్న తుపాకీని లాక్కున్నారు. తీవ్రంగా ప్రతిఘటించడంతో అతను పారిపోయాడు. మాస్కు ధరించిన వ్యక్తిని ఇంట్లో బంధించి, అక్కడున్న వారిని అప్రమత్తం చేశారు. అతను కత్తితో బెదిరించి పారిపోతుండగా, స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అమిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హెల్మెట్ ధరించిన వ్యక్తిని కాజీపేటలో అదుపులోకి తీసుకున్నారు. ఇందులో హెల్మెట్ ధరించిన వ్యక్తి.. గతంలో నవరతన్ ఇంట్లో క్లీనింగ్ బాయ్గా పని చేసినట్లు తెలిసింది.