బంజారాహిల్స్, మార్చి 22: ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా.. అనే సామెత మనందరికీ తెలిసిందే. ఈ సామెతకు అచ్చు సరిపోయేలా ఓ తల్లి.. తను దొంగతనాలు చేయడంతో పాటు తన ముగ్గురు కొడుకులను కూడా అదే వృత్తిలో దించింది. తాళం వేసిన ఇళ్లను గుర్తించడం.. తన కొడుకులను ఆ ఇంటికి పంపించి దొంగతనాలు చేయించడం.. చోరీసొత్తును గుట్టు చప్పుడు కాకుండా అమ్మడ మే కాకుండా వారి తరపున లాయర్లను మాట్లాడి బెయిల్ ఇప్పించడం అలవాటుగా మార్చుకుంది.
నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీ ఘటనల్లో నిందితురాలిగా ఉన్న సనా బేగం అలియాస్ సనా టైగర్ అలియాస్ సనా డాన్(48) తో పాటు ఆమె కొడుకు సోహైల్ (26)లను డైమండ్ హిల్స్ కాలనీలో చోరీ ఘటనలో అరెస్ట్ చేసిన ఫిలిం నగర్ పోలీసులు రిమాండ్కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం..
షేక్పేట సమీపంలోని డైమండ్ హిల్స్ కాలనీకి చెందిన మహ్మద్ ముజాహిద్ కమల్ అనే ఎన్ఆర్ఐ ఇంట్లో 34 తులాల బంగారం ఆభరణాలతో పాటు సుమారు రూ 4.5 లక్షల నగదు, విదేశీ కరెన్సీ చోరీ చేసిన ఘటనలో బండ్లగూడ ప్రాంతంలో నివాసం ఉంటున్న సనా బేగంతో పాటు ఆమె ముగ్గురు కొడుకులు మహమ్మద్, సాహిల్, సోహైల్ పాత్ర ఉన్నట్లు తేలింది. చోరీ సొత్తులో పది తులాల బంగారాన్ని టోలీచౌకి ప్రాంతంలో విక్రయించేందుకు వచ్చిన సనాబేగం, సోహైల్లను ఫిలిం నగర్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు.
పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు..
ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డైమండ్ హిల్స్ చోరీ ఘటనలో తల్లి సనా బేగం డైరెక్షన్లో ఆటోలో వచ్చి పారిపోయే క్రమంలో పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు నిందితులు మహమ్మద్, సాహిల్లు అనేక రకాలుగా ప్రయత్నించారని తెలిసింది. చోరీ అనంతరం ఆటోలో నేరుగా బండ్లగూడలోనే తమ ఇంటికి వెళ్తే సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించే అవకాశం ఉందని భావించిన నిందితులు.. రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లోని కొన్ని బస్తీల్లో సుమారు రెండు గంటల పాటు తిరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది.
సుమారు 40 గంటల పాటు ఫిలింనగర్ క్రైమ్ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వందలాది సీసీ కెమెరాలు జల్లెడ పట్టారు. వేర్వేరు మార్గాల్లో నిందితులు బండ్లగూడలోని ఇంటికి చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని గంటలు అక్కడుండి.. కొంత సొత్తును తల్లికి ఇచ్చి వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. సుమారు 500 దాకా సీసీ కెమెరాలను పరిశీలించిన అనంతరం బండ్లగూడలోని సనా బేగం ఇంటికి వెళ్లిన పోలీసులకు నిరాశ ఎదురైంది.
పోలీసులు తన ఇంటికి వెళ్లారనే విషయం తెలుసుకున్న సనా బేగం తన రెండో కొడుకు సోహైల్ తో కలిసి బంగారాన్ని అమ్మేందుకు వచ్చి పోలీసులకు చిక్కింది. ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి నిందితురాలు సనా బేగంను వైద్య పరీక్షల కోసం స్థానికంగా ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ కూడా ఆమె హైడ్రామా చేసినట్లు తెలిసింది. తనకు ఆరోగ్యం సరిగాలేదని.. తనను అరెస్టు చేసేలా రిపోర్ట్ ఇస్తే తర్వాత జరిగే పరిణామాలకు మీదే బాధ్యత అంటూ సదరు వైద్యుడిని దబాయించిందని తెలిసింది.
ఎట్టకేలకు అర్ధరాత్రి దాటిన తర్వాత ఉస్మానియా ఆస్పత్రిలో పలు రకాల వైద్య పరీక్షల అనంతరం నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. సనా బేగం మీద పలు పోలీస్ స్టేషన్లలో పరిధిలో 43 కేసులు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో చోరీ కేసుతోపాటు ఆర్గనైజింగ్ క్రైమ్ నిర్వహించే వారిపై కఠినంగా ఉండేందుకు కొత్తగా వచ్చిన బీఎన్ఎస్ 111 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి పది తులాల బంగారం స్వాదీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు.