సిటీబ్యూరో, మే 27(నమస్తే తెలంగాణ): అక్రమంగా విదేశీ కరెన్సీతో షార్జా వెళ్లేందుకు యత్నించిన ఓ మహిళను శంషాబాద్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్, సీఐడబ్ల్యూ సిబ్బంది పట్టుకుని ఆర్జీఐఏ కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. జీన్ అల్నేసా మొహమ్మద్ ఖమర్ ఆల్దీన్ అనే మహిళ(పాస్పోర్ట్ నంబర్ జీకే.8233970) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నేషనల్ ఫ్లైట్ నం.జీ9-459లో వెళ్లేందుకు శనివారం ఉదయం 4:20 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నది.
అయితే సదరు మహిళ కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో గమనించిన సీఐఎస్ఎఫ్ ఏఎస్ఐ సంపత్రావు, సిటీ అధికారి షేక్ జానీబాబులు సదరు మహిళను ఆపి ఆమె వద్ద ఉన్న వస్తువులను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సదరు మహిళ హ్యాండ్బ్యాగ్లో 44,480 యునైటెడ్ ఎమిరేట్స్ దిర్హామ్లను గుర్తించారు. భారత కరెన్సీ ప్రకారం.. దీని విలువ రూ.9,67,440 ఉంటుందని అధికారులు తెలిపారు. దీంతో సదరు మహిళను అదుపులోకి తీసుకున్న అధికారులు తదుపరి విచారణ నిమిత్తం ఆర్జీఐఏ కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. మహిళ వద్ద ఉన్న విదేశీ కరెన్సీతోపాటు ఇతర వస్తువులను సీజ్ చేశారు.