సిటీబ్యూరో, ఆగస్టు 9(నమస్తే తెలంగాణ):24 గంటలు వైద్య పరీక్షలు నిర్వహించుకునేలా ఆధునిక టెక్నాలజీతో కూడిన కియోస్కీని హైదరాబాద్కు చెందిన సంస్థ డెవలప్ చేసింది. నిమిషాల వ్యవధిలో 75 రకాల వైద్య పరీక్షలను నిర్వహించి ఫలితాలను పొందవచ్చు. సాధారణ రోగుల కోసం కార్పొరేట్ హాస్పిటల్ వెళ్లలేనివారు, అత్యవసర వైద్యం మినహా మెడికల్ చెకప్ కోసం వైద్యులను ఆశ్రయించే వారికి తక్కువ ఖర్చుతో సులభంగా డయాగ్నోస్టిక్స్ చేసేలా కియోస్కీని డెవలప్ చేశారు. గ్రామీణ ప్రాంతాలు, అర్బన్ ఏరియాలతోపాటు హైదరాబాద్ లాంటి నగరాల్లోనూ వీటిని ఏర్పాటు చేసి టెక్నాలజీ ఆధారంగా వైద్య సేవలు పొందేందుకు వీలుగా “ఎనీ టైం క్లినిక్”ను ప్రణామ్ హాస్పిటల్స్తో కలిసి రూపొందించినట్లుగా జెమ్ ఓపెన్క్యూబ్ టెక్నాలజీస్ ఎండీ వినోద్కుమార్ తెలిపారు.
తక్కువ ఖర్చులో వైద్యసేవలు
ఈ నెలాఖరులోగా శిల్పారామంలో తొలి హెల్త్ కియోస్కీని ఏర్పాటు చేయనున్నారు. రూ.150 ఖర్చుతో షుగర్, బీపీ, ఈసీజీ, బీఎంఐ, బీఎంఆర్, ఫాట్, బాడీ వాటర్, కండ బలం, కంటి, చెవి, ముక్కు పరీక్షలతోపాటు హెచ్ఐవీ రిస్క్ టెస్ట్, లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, ట్యూమర్ రిస్క్ టెస్ట్, సర్వైకల్ క్యాన్సర్, కొవిడ్ రిస్క్ టెస్ట్, ఐక్యూ టెస్ట్ వంటి పరీక్షలను ఏకకాలంలో పొందవచ్చు. కంప్యూటర్ను పోలినట్లుగా ఉండే కియోస్కీ ద్వారా వేగంగా, 24గంటలపాటు తక్కువ ఖర్చులో వైద్యపరీక్షలు నిర్వహించుకునే అవకాశం ఉందని వినోద్ కుమార్ తెలిపారు. వైద్య సేవలను మెరుగుపర్చడమే లక్ష్యంగా ప్రణామ్ హాస్పిటల్స్తో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టినట్లుగా వివరించారు.
నిరంతరం వైద్య సేవలు
టెక్నాలజీ సాయంతో వైద్య సేవల పరిధి పెరిగింది. 24గంటల పాటు వైద్య సేవలు అందించే వీలు దొరికింది. అయితే అత్యవసర సమయంలో మెరుగైన వైద్యం కోసం ఖచ్చితంగా వైద్య పరీక్షలు అవసరం ఉంటుంది. కానీ సమయం, సందర్భం, వైద్యుల లభ్యత వంటి అంశాల కారణంగా డయాగ్నోస్టిక్స్ సేవలను పొందలేని పరిస్థితి ఉంది. అలాంటి ఇబ్బందులను ఎదుర్కొనడానికి వీలుగా ఏనీ టైం క్లినిక్ కియోస్కీని డెవలప్ చేశాం. ఎఫ్డీఏ, ఇతర అనుమతులు పొందిన తర్వాతనే అందుబాటులోకి తీసుకువచ్చాం. సాధారణ వైద్య పరీక్షల ఫలితాలను బట్టి నేరుగా వైద్యులను టెలీ కాన్ఫరెన్స్లో కలిసేందుకు వీలుగా కియోస్కీని డెవలప్ చేశాం.
– వినోద్ కుమార్, జెమ్ ఓపెన్క్యూబ్ టెక్నాలజీస్ ఎండీ
వైద్యసేవలు మరింత సులభం
ఆధునిక యుగంలో వైద్యసేవలు మరింత సులభతరం అవుతున్నాయి. సూది గుచ్చాల్సిన అవసరం లేకుండా, వైద్య నిపుణులు అవసరం లేకున్నా వేగంగా వైద్యపరీక్షలు చేయించుకునే వీలు కలుగుతుంది. హైదరాబాద్ కేంద్రంగా పలు వినూత్న ఆవిష్కరణలకు రూపకల్పన చేస్తున్న జెమ్ ఓపెన్ క్యూబ్ టెక్నాలజీస్ సంస్థతో తాజాగా మరో కియోస్కీని డెవలప్ చేసింది. గతంలో గోల్డ్ ఏటీఎం, టీ, కాఫీలను అందించే వెండింగ్ యంత్రాలను అందుబాటులోకి తీసుకురాగా, తాజాగా 24గంటలపాటు డయాగ్నోసిస్ సేవలు అందించే కియోస్కీని రూపొందించారు.