సిటీబ్యూరో, నవంబర్ 16(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రతిపాదనలు తీసుకువస్తోంది. తాజాగా కూకట్పల్లి నుంచి కోకాపేట వరకు మరో కొత్త ప్రజా రవాణా ప్రాజెక్ట్ అయిన లైట్ రైల్ ట్రాన్సిట్ సిస్టం (ఎల్ఆర్టీఎస్)ను చేపట్టేందుకు ప్రతిపాదనలను హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టు అథారిటీ (ఉమ్టా) సిద్ధం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రాంతం వెస్ట్జోన్. దీని పరిధిలో మెరుగైన మౌలిక వసతులతో పాటు ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వ రంగ సంస్థలు చర్యలు చేపట్టాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వెస్ట్ జోన్ పరిధిలోని ఐటీ కారిడార్ మరింతగా విస్తరించింది. ఇక్కడ పనిచేసే ఐటీ ఉద్యోగులంతా తాము పనిచేసే ప్రదేశానికి సమీపంలోనే నివాసాలు ఉండాలని కోరుకుంటున్నారు. దీంతో మాదాపూర్ హైటెక్ సిటీతో పాటు గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట చుట్టు పక్కల ప్రాంతాల్లో నివాస ప్రాంతాలు ఊహించని రీతిలో పెరిగాయి. ప్రధానంగా తెలంగాణ ఏర్పాటుకు ముందు ఐటీ ఉద్యోగులు ఎక్కువ నివాస ఉండే ప్రాంతంగా కూకట్పల్లి, కేపీహెచ్బీ, మియాపూర్, నిజాంపేట ప్రాంతాలు ఉండేవి. ఆ తర్వాత క్రమంగా కొండాపూర్ నుంచి రాయదుర్గం, నానక్రాంగూడ, నార్సింగి, కోకాపేట ప్రాంతాల్లో నివాస ప్రాంతాలతో పాటు బహుళ జాతీయ కంపెనీలు ఉన్నాయి. దీంతో కేపీహెచ్బీ నుంచి ఈ ప్రాంతాల మధ్య ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చాలని గుర్తించారు.
వెస్ట్ జోన్లోనే లక్షలాదిగా ఉద్యోగులు..
ఐటీ కారిడార్ పరిధిలోని మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట ప్రాంతాల్లో చాలా వరకు బహుళ జాతి కంపెనీలు ఉన్నాయి. మరిన్ని కంపెనీలు మున్ముందు ఏర్పాటు కాబోతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో లక్షలాది మంది ఉద్యోగులు నిత్యం పనిచేస్తూ ఉంటారు. భవిష్యత్తులో వీరంతా కార్యాలయాలకు వచ్చి వెళ్లేందుకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టు సిస్టిం ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించారు. నగరంలోనే అతి పెద్ద హౌజింగ్ కాలనీల్లో ఒకటిగా ఉన్న కూకట్పల్లి హౌజింగ్ బోర్డు నుంచి కోకాపేట వరకు లైట్ రైల్ ట్రాన్సిట్ సిస్టిం (ఎల్ఆర్టీఎస్) ప్రాజెక్టు చేపడితే ఎలా ఉంటుందని ఉమ్టా సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును తయారు చేసింది. ప్రతిపాదనల ప్రకారం, కూకట్పల్లి నుంచి కోకాపేట వరకు మొత్తం 24.50 కి.మీ మేర ఎల్ఆర్టీఎస్ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే ఉన్న మెట్రో రైలు ప్రాజెక్టుతో అనుసంధానం అయ్యేలా నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందులో కేపీహెచ్బీ, రాయదుర్గం, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్తో పాటు హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్తోనూ అనుసంధానం చేయనున్నారు. డీపీఆర్ను ప్రభుత్వం పరిశీలనకు పంపించామని, ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందని అధికారులు తెలిపారు.