సిటీబ్యూరో, జనవరి 18 (నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా ప్రజలకు ప్రపంచ స్థాయి మౌలిక వసతులను కల్పించేందుకు జీహెచ్ఎంసీ విశేషంగా కృషి చేస్తున్నది. ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రూ. 56.82 కోట్లతో 21,535 మీటర్ల మేర 29 చోట్ల మోడల్ కారిడార్లకు శ్రీకారం చుట్టింది. వెండింగ్ జోన్లు, గ్రీనరీ, పారింగ్, పాదచారుల సౌకర్యం ఇలా ప్రత్యేకతలతో కారిడార్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసుకొని పనులను వేగవంతం చేశారు. పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి విడతల వారీగా అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు తెలిపారు.