బన్సీలాల్పేట్, ఏప్రిల్ 17 : దవాఖానలలో వందలాది మంది రోగులు ఉంటారని, అనుకోని ప్రమాదం సంభవిస్తే బయటకు వెళ్లడానికి రెండు మార్గాలు తెరిచి ఉంచాలని అగ్నిమాపక శాఖ హైదరాబాద్ జిల్లా అధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన వారోత్సవాల్లో భాగంగా బుధవారం గాంధీ దవాఖాన ఆవరణలో మాక్ డ్రిల్ నిర్వహించారు. భవనం పై అంతస్తులలో ప్రమాదంలో చిక్కిన వారిని కిందకు దించడం, గదులలో మంటలు, పొగ నిండిపోతే ఎలా అప్రమత్తం కావాలి, మంటలను నీటి ద్వారా ఎన్ని రకాలుగా ఆర్పడానికి అవకాశాలు ఉన్నాయనే దానిని అగ్నిమాపక శాఖ సిబ్బంది చేసి చూపించారు.
పొగ వలన ఊపిరి తీసుకోలేని వారిని ఎలా కాపాడాలని ఓ నర్సు చేత చేయించి వివరించారు. గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు మాట్లాడుతూ నాలుగేండ్ల కాలంలో ఎలాంటి చిన్న అగ్నిప్రమాదం కూడా జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. దవాఖానలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రతి నెలా ఇలాంటి అవగాహన శిబిరం నిర్వహించాలని ఆయన కోరారు.
దవాఖాన ఆవరణలో అగ్నిమాపక శాఖ ఔట్ పోస్ట్లో 24 గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఫైర్ అధికారి వెంకటేశ్వర్లు, గాంధీ దవాఖాన ఔట్పోస్ట్ ఫైర్ అధికారి ఎండీ ముస్తఫా, స్నోర్కల్ ఫైర్ అధికారి ఎండీ షబ్బీర్ అలీ, గాంధీ దవాఖాన డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ వినయ్శేఖర్, ఆర్ఎంఓ డాక్టర్ జయకృష్ణ, సెక్యూరిటీ అధికారి శివాజీ, పలువురు వైద్యులు, నర్సులు, సెక్యూరిటీ, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.