ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 16: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటల్ని మాదిగ జాతి ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్ అన్నారు. మాదిగలతో రేవంత్ వైరం కోరుకుంటే యుద్ధానికి మాదిగలు సిద్ధమేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రజల ముందు అబద్ధాలు చెప్పడం సరికాదని హితవు పలికారు. బౌద్ధనగర్ డివిజన్ పార్సిగుట్టలోని ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో గోవిందు నరేశ్ మాట్లాడారు. మాదిగలకు పార్లమెంట్కు వెళ్లేందుకు అవకాశం ఇవ్వనివాళ్లు వర్గీకరణ చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
రెడ్లకు ఇచ్చిన పదవులు ఎన్ని? మాదిగలకు ఇచ్చిన పదవులు ఎన్ని? లెక్కలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి మాదిగలకు చేసింది తక్కువని, ఆయనకు మాదిగలు చేసిందే ఎక్కువని అన్నారు. మాలలు కుర్చీ లాక్కుంటారో.. లేదో.. కానీ, మాదిగలు మాత్రం పోరాడి కుర్చీ నుంచి దించుతారని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న 3 ఎస్సీ రిజర్వుడ్ ఎంపీ స్థానాలు, కంటోన్మెంట్ ఎస్సీ రిజర్వుడ్ ఎమ్మెల్యే స్థానాల్లో ఒకటి కూడా మాదిగలకు కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని మండిపడ్డారు. ఇప్పటికే దీనిపై మాదిగ ప్రజలు ఆవేదనతో రగిలిపోతుంటే రేవంత్ రెడ్డి సోమవారం మాట్లాడిన మాటలు పుండు మీద కారం చల్లినట్లుగా ఉందని అభిప్రాయపడ్డారు. ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టులో ప్రభుత్వం నియమించిన ఉద్ధండుడైన న్యాయవాది ఎవరో చెప్పాలని సవాల్ విసిరారు.
మంద కృష్ణ మాదిగ జైలులో ఉన్నప్పుడు తానే న్యాయవాదిని పెట్టానని రేవంత్ అంటున్నారని, కానీ మంద కృష్ణ బెయిల్కు రేవంత్కు సంబంధం లేదని వివరించారు. జనాభా ప్రాతిపదికన మాదిగలు, మాలలు, ఉపకులాలకు ప్రాతినిధ్యం కల్పిస్తామని, సామాజిక న్యాయం అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లోనే ఆ హామీకి సమాధి కట్టిందని దుయ్యబట్టారు. చేసిన తప్పులను సరిదిద్దుకుని ఎంపీ స్థానాల్లో మాదిగలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మాదిగలను కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగకూడదన్నారు. కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు సోమశేఖర్, ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి డప్పు మల్లికార్జున్, నాయకులు నలిమెల విజయరావు, బైరపోగు శివ, రఘు, రాజశేఖర్, శివప్రసాద్, సాయికుమార్, మహేశ్, ప్రవీణ్ పాల్గొన్నారు.