ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 13: ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సెంటెనరీ పైలాన్ను(OU Centenary Pylon) పట్టభద్రుల ఎమ్మెల్సీ సురభి వాణీదేవి(MLC Surabhi Vanidevi) బుధవారం ప్రారంభించారు. ఆర్ట్స్ కళాశాల పక్కనే నిర్మించిన ఈ పైలాన్ను రూ.1.5 కోట్ల వ్యయంతో రూపొందించారు. దీనికి జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కళాశాలకు చెందిన రాజేందర్ నాగుల ఆర్కిటెక్ట్గా, కేఎస్ రఘు చక్రవర్తి శిల్పిగా పైలాన్ను తీర్చిదిద్దారు.
ఈ సందర్భంగా వాణీదేవి మాట్లాడుతూ.. పైలాన్ను ఆవిష్కరించడం తన జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని అన్నారు. ఓయూ 75 ప్రారంభించి 75 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా నిర్వహించిన ప్లాటినం జూబ్లీ పైలాన్ను తన తండ్రి, అప్పటి పీవీ నరసింహారావు ప్రారంభించడం, శతాబ్ది ఉత్సవాల పైలాన్ను తాను ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఓయూ, ఆర్ట్స్ కళాశాల భవనం విద్యార్థులు, అధ్యాపకులకు మాత్రమే కాకుండా ఎంతో మందికి ఉత్తేజం, ప్రేరణను అందిస్తోందని పేర్కొన్నారు.
పర్యాటకులకు సైతం ఓయూ ఔన్నత్యం తెలిపేలా పైలాన్, ఎత్తైన జాతీయ జెండా ఏర్పాటు చేయడం సముచిత నిర్ణయమన్నారు. ఓయూ అందించిన వందేళ్ల విద్య, పరిశోధన, ఆవిష్కరణలు, పోరాట వారసత్వానికి చిహ్నంగా పైలాన్ నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఓఎస్డీ ప్రొఫెసర్ రెడ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.