కేపీహెచ్బీ కాలనీ, మార్చి 3 : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. ఆదివారం మూసాపేట పాటిదార్ భవనంలో బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ వాణీదేవి మాట్లాడుతూ.. మహిళలు చదువుకొని ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దివంగత ప్రధాని పీవీ.నర్సింహారావు సేవలను గుర్తిస్తూ దేశ అత్యున్నతమైన భారతరత్న ఇవ్వడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమన్నారు.
ప్రధానిగా పీవీ నర్సింహారావు దేశ ఆర్థిక విధానాలతో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. ఆయా రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళలను సన్మానించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం శిరీష నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సమైఖ్య సభ్యులు విజయలక్ష్మి, హేమలత, దేవిక, శశికళ, సుధారాణి, శ్రీదేవి, కావేరి, సరోజ, రత్నకుమారి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.