దుండిగల్, నవంబర్ 22: ప్రతిపక్షాల మాటలు విని కుత్బుల్లాపూర్ ప్రజలు ఆగం కావొద్దని ఎమ్మెల్సీ, నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ.వివేకానంద్ అన్నారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బౌరంపేట్లోని త్రిపుర విల్లాస్, ఇందిరమ్మ కాలనీ, సింహపురి కాలనీ, బౌరంపేట్ గ్రామాలతో పాటు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సప్తపది గార్డెన్స్లో నిర్వహించిన ‘కమ్మ సంఘం ఆత్మీయ సమ్మేళనం’లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో ఓట్లడుగుతున్న నేతలు 11సార్లు అవకాశమిస్తే రాష్ట్రానికి ఏం ఒరగబెట్టారో ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో ఉన్న వాళ్లంతా తెలంగాణ బిడ్డలేనని స్పష్టం చేశారు. కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా మనల్ని విడదీసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఓట్ల సమయంలోనే ప్రజల్లోకి వచ్చే ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మొద్దని సూచించారు. కాగా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని దుండిగల్, గాగిళ్లాపూర్, చర్చిగాగిళ్లాపూర్, నాగులూరు, దుండిగల్ తండా-1,2లో ఎమ్మెల్యే వివేకానంద్ ప్రచారం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు బోనాలతో వచ్చి ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు.