కేపీహెచ్బీ కాలనీ, జనవరి 28 : కేసీఆర్ ప్రభుత్వం మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సదుపాయాలు కల్పించింది. అయితే ప్రభుత్వమే అన్ని సర్కారు పాఠశాలలను అభివృద్ధి చేయాలంటే ఆలస్యమవుతుందని పేద విద్యార్థుల కోసం ఏదైనా చేయాలన్న సంకల్పంతో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాలను పునరుద్ధరించేందుకు ముందుకు వచ్చారు ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్కుమార్. తాను పుట్టి పెరిగిన ఊరికి, సమాజంలోని పేద విద్యార్థులకు తనవంతుగా ఏదైనా సహాయం చేయాలని సంకల్పించారు. తాత మాధవరం రాంచందర్రావు, అమ్మమ్మ సుశీల జ్ఞాపకార్థం తన సొంత నిధులతో ప్రభుత్వ పాఠశాల భవనాలను నిర్మించే పనులకు అంకురార్పణ చేశారు. మొదట బాలానగర్ డివిజన్లోని రాజీవ్గాంధీ నగర్లో రేకుల షెడ్లో కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలను తాత మాధవరం రాంచందర్రావు జ్ఞాపకార్థం, రూ. 90 లక్షలు వెచ్చించి 294 చదరపు అడుగుల విస్తీర్ణంలో (జీ ప్లస్ టూ) ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఈ పాఠశాలలో 210 మంది విద్యార్థులు సంతోషంగా విద్యనభ్యసిస్తున్నారు.
కూకట్పల్లిలో శిథిలావస్థలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 3 గదుల్లో 160 మంది విద్యార్థులు చదువుతున్నారు. సరైన వసతులు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడేవారు. పాఠశాల దుస్థితిని గమనించిన ఎమ్మెల్సీ నవీన్కుమార్ అమ్మమ్మ మాధవరం సుశీలమ్మ జ్ఞాపకార్థం పాఠశాల భవనాన్ని పునరుద్ధరించేందుకు ముందుకొచ్చారు. ఆరు నెలల కిందట పాఠశాల భవనం పునర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 90 లక్షల రూపాయలు వెచ్చించి సకల వసతులతో కూడిన జీ ప్లస్ 2 పాఠశాల భవనాన్ని నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్లో కిచెన్ షెడ్, పై రెండు అంతస్తుల్లో ఐదు తరగతి గదులు, ఆఫీస్ రూమ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్లు ఉండేలా నిర్మించారు. పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు కావాల్సిన బెంచీలు, కుర్చీలు, డిజిటల్ క్లాస్రూమ్లు, మరుగుదొడ్లను కూడా నిర్మించారు. పనులు పూర్తి కావడంతో సోమవారం పాఠశాలను ఎమ్మెల్సీ నవీన్కుమార్, ఎమ్మెల్యే కృష్ణారావు, జిల్లా విద్యాధికారి విజయకుమారి ప్రారంభించనున్నారు.