మేడ్చల్, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో భక్తజనం పరవశించిపోయింది. కొత్తగా నిర్మించిన ఆలయాలలోని అమ్మవార్లకు భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన బోనాల వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక ఆకర్శణగా నిలిచింది. నూతనంగా నిర్మించిన మహంకాళి, ఈదమ్మ, పోచమ్మ, మైసమ్మ దేవాలయాలలోని అమ్మవార్లకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం బంగారు బోనం సమర్పించారు. ఇటీవలే రూ.3 కోట్లతో నిర్మించిన దేవాలయాలలో విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించి బోనాల ఉత్సవాలను ఘనంగా, వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హాజరయారు. ఈ సందర్భంగా వేలాది సంఖ్యలో మహిళలు ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికారు. అనంతరం, బంగారు బోనాన్ని ఎత్తుకున్న కవిత మహిళలతో కలిసి ఊరేగింపుగా దేవాలయానికి వెళ్లి అమ్మవారికి బోనం సమర్పించారు. పూజారులు పత్యేక పూజలను నిర్వహించి ఎమ్మెల్సీ కవితను ఆశీర్వదించి తీర్ద ప్రసాదాలను అందజేశారు.
తరలి వచ్చిన ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు
కవిత రాకతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. ఈ సందర్బంగా కవితను కలిసేందుకు ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పోటీ పడ్డారు. కవితతో సెల్ఫీలు దిగేందుకు మహిళలు పోటీ పడ్డారు. ఫొటోలు దిగేందుకు కవిత సహకరించడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.