MLC Kavitha | కవాడిగూడ, మార్చి 8: రాష్ట్రంలో మహిళల విద్యా ఉద్యోగాలకు సంబంధించి 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కుట్ర పూరితంగా తీసుకువచ్చిన జీవో నం.3ను వెంటనే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఇందిరా పార్కు ధర్నా చౌక్లో భారత జాగృతి ఆధ్వర్యంలో ఉద్యోగ నియామకాలలో అన్యాయం చేసే జీవో నం.3ను రద్దు చేసి మహిళలకు ఉద్యోగాలలో 33 శాతం వాటా కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, ప్రభుత్వాలు మారినంత మాత్రాన ప్రజల హక్కులు కాలరాయొద్దని అన్నారు. మహిళల ఉద్యోగ నియామకాలలో బీహార్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నం.3ను రద్దు చేసి మహిళలకు ఉద్యోగాలలో 33 శాతం రిజర్వేషన్లను అమలు చేసి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. వ్యక్తిగత కారణాలతో చనిపోయిన అమ్మాయిల చావులను కూడా రాజకీయం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ జీవో నం.3 ద్వారా మహిళలకు తీవ్ర అన్యాయం చేస్తున్నదని ఆమె మండిపడ్డారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు పార్లమెంట్కు వెళ్లాలి. కాని, తెలంగాణ ఆడబిడ్డలు మాత్రం ఉద్యోగాలు రాకుండా ఇంట్లోనే ఉండిపోవాలా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే మహిళా హక్కుల కోసం రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడం దౌర్భాగ్యమని అన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లో ఢిల్లీకి వెళ్లి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ వద్ద హాజరు వేసుకోవడం తప్ప సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు మీద ఉన్న మహిళల హక్కులు, ఉద్యోగాల నియామకాలలో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో శ్రద్ధ లేదని ఆమె మండిపడ్డారు.
మాయ మాటలు, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి మాకు ఒక్క శాతం ఓట్ల తేడా మాత్రమే ఉందన్నారు. డిసెంబర్ 9న అన్ని గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అమలు చేయకుండా తప్పించుకుంటున్నారని అన్నారు. ఏది అడిగినా వంద రోజులు ఆగమంటున్నారని, ఇంకా పది రోజుల సమయం ఉందని, ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయకుంటే నిలదీస్తామని ఆమె హెచ్చరించారు.
జీవో నం.3 వల్ల గురుకులాల్లో కేవలం 12 శాతం రిజర్వేషన్లు మాత్రమే అమలు జరిగినట్లు తెలిపారు. మహిళలను ప్రోత్సహిస్తే అద్భుతాలు జరుగుతాయని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా వ్యతిరేక విధానాలతో ముందుకు వెళుతుందని, మహిళలకు న్యాయం చేయాలని చిత్త శుద్ధి ఉంటే జీవో నం.3పై హైకోర్టులో పిటిషన్ వేయాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళా హక్కుల కోసం చట్టాలు రూపకల్పన చేయాలని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వల్ల అనేక హక్కులు వచ్చాయన్నారు. 1996లో విద్యలో 33 శాతం మహిళలకు వాటా కల్పించారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ పోలీస్ శాఖలో, మార్కెట్ కమిటీలో మహిళలకు వాటా కల్పించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
ఓయూలో 72 శాతం అమ్మాయిలే కేసీఆర్ లక్షా అరవై వేల ఉద్యోగాలతో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసి అవకాశం కల్పించారన్నారు. పాత ప్రభుత్వంలో తప్పులు దొర్లితే సరిదిద్దాలని, రాజస్థాన్ కోర్టు తీర్పును కేసీఆర్ వ్యతిరేకించి హైకోర్టును ఆశ్రయించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తరువాత ఆడ పిల్లల శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారని ఆరోపించారు. విద్యార్థులకు అండగా నిలవాల్సిన రేవంత్ రెడ్డి కోర్టులో కేసును ఉపసంహరించుకోవడం దారుణమన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రజావాణి కాదు ఢిల్లీ వాణి మాత్రమే వినిపిస్తాయన్నారు.
పీహెచ్సీ వాళ్లకు కూడా రిజర్వేషన్లు కల్పించడం లేదని, వారు కూడా ఈ పోరాటంలో ఐక్యంగా ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, మాజీ చైర్మన్లు గజ్జెల నాగేష్, మేడి రాజీవ్ సాగర్, దేవీ ప్రసాద్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్ రెడ్డి, యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ గుట్ట రాంచందర్, ఓయూ జేఏసీ నేత దత్తాత్రేయ, వివిధ సంఘాల నాయకులు సత్యం, గౌతం ప్రసాద్, సుమిత్ర, బీఆర్ఎస్ నాయకులు ముఠా జై సింహా, కల్వ గోపీ, ముచ్చకుర్తి ప్రభాకర్, వల్లాల శ్యామ్ యాదవ్, ఆర్.రాజేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.