లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా బుధవారం తనను మర్యాదపూర్వకంగా కలిసిన సైఫాబాద్ సైన్స్ కళాశాల విద్యార్థినులతో సెల్ఫీ దిగుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
భారత పార్లమెంట్లో మహిళా బిల్లు ఆమోదం పొందడం పట్ల తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శాగంటి సోమయ్య హర్షం వ్యక్తం చేశారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించడం హర్షనీయమన్నారు. దేశ చరిత్రలో ఇదొక చారిత్రక అధ్యాయమని చెప్పారు.
– అబిడ్స్, సెప్టెంబర్ 20
కంటోన్మెంట్, సెప్టెంబర్ 20 : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోరాటంతోనే లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టారని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కవితక్క గత కొన్నేళ్లుగా రాజీలేని పోరాటం చేశారని, ఇందులో భాగంగానే కేంద్రంలో కదలిక వచ్చిందన్నారు. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ అమలుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం ఎమ్మెల్సీ కవిత పోరాటంతోనే సాధ్యమైందన్నారు.\
సుల్తాన్బజార్,సెప్టెంబర్ 20 : చట్ట సభల్లో మహిళా బిల్లు ఆమోదానికి కృషి చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బుధవారం సైఫాబాద్ సైన్స్ కళాశాల పీజీ, యూజీ విద్యార్థినులు మర్యాద పూర్వకంగా కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఎమ్మెల్సీ కవితతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఓయూ అనుబంధ కళాశాలల్లోనే పీజీ వసతి గృహాలు ఏర్పాటు చేయడం పట్ల సీఎం కేసీఆర్కు, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జె.లక్ష్మణ్నాయక్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాసబ్ట్యాంక్లోని సైఫాబాద్ సైన్స్ కళాశాలలో వసతి గృహం నిర్మించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత యూజీ విద్యార్థినుల కోసం హాస్టల్ భవనాలను నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 20(నమస్తే తెలంగాణ) : మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టి, ఆమోదం తెలపడం పట్ల నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాలకు పైగా పెండింగ్లో ఉన్న బిల్లును ప్రవేశపెట్టడం సంతోషంగా ఉందన్నారు. ఇకపై మహిళలు కూడా రాజకీయ రంగంలో ముందుంటారని, మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకొని దేశాభివృద్ధిలో తమ పాత్రను పోషిస్తారన్నారు. బిల్లుకు నారీ శక్తి అని నామకరణం చేయడంపై మహిళలందరి తరుఫున కృతజ్ఞతలు తెలిపారు. కాగా మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడానికి ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితమేనని, ఆమెను కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.