కుత్బుల్లాపూర్,మార్చి13: మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు సోమవారం కుత్బుల్లాపూర్లో ప్రశాంతంగా ముగిశాయి. కుత్బుల్లాపూర్ విలేజ్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సెంటర్లో రెండు పోలీంగ్బూత్ల ద్వారా ఉపాధ్యాయులు తమ ఓటును సద్వినియోగం చేసుకున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా 1067 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా అందులో 889 మంది ఉపాధ్యాయులు తమ ఓటును సద్వినియోగం చేసుకున్నారు. కాగా మొత్తం 81 శాతం పోలీంగ్ శాతం నమోదైన్నట్లు ఎన్నికల పరిశీలకులు, తహశీల్దార్ సంజీవరావు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మొదలైన ఎన్నికల ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా బాలానగర్ డీసీపీ శ్రీనివాస్రావు నేతృత్వంలో పోలీస్బలగాలతో కట్టుదిట్టం చేశారు. కాగా పోలీంగ్ కేంద్రానికి సమీపంలోని ఆయా పార్టీల నేతలు క్యాంపెయిన్ చేసుకున్నారు. అయితే బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు తమ క్యాంపెయిన్ సమయంలో పార్టీ జెండాను ఏర్పాటు చేయడంతో ఇతర పార్టీల శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేయగా ఎన్నికల పరిశీలకులు సంజీవరావు దృష్టికి వెళ్లింది. నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో పోలీసుల సహకారంతో పార్టీ జెండాలను తొలగింప చేశారు. కాగా ఉపాధ్యాయులు తమ ఓటును హక్కును సద్వినియోగం చేసుకునేందుకు చంటిబిడ్డలతో పాటు కేంద్రానికి వచ్చి, తమ సహాయకుల సహకారంతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.