సికింద్రాబాద్/మారేడ్పల్లి/బొల్లారం, డిసెంబర్ 23: సికింద్రాబాద్ పరిధిలోని పలు ఆలయాల్లో శనివారం వైకుంఠ ఏకాదశిని భక్తులు ఘనంగా జరుపుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకునేందుకు తెల్లవారు జాము నుండే వేంకటేశ్వర స్వామి ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీనివాస్నగర్ కాలనీలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం, నామాలగుండు కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆలయ చైర్మన్ నోముల ప్రకాశ్రావు వేకువ జామునే వైకుంఠ ఏకాదశి పూజలు, ఉత్తర ద్వార దర్శనాన్ని ప్రారంభించారు.
పలు కళాశాలలకు, స్కూల్లకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన కోలాటం, నృత్యాలు భక్తులను అలరించాయి. స్వామి వారిని కుటుంబసమేతంగా ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ తనయుడు తీగుల్ల రామేశ్వర్గౌడ్ దర్శించుకున్నారు. ఈవేడుకల్లో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత, మాజీ మేయర్ బండ కార్తికరెడ్డి, స్థానిక డివిజన్ కార్పొరేటర్ సామలహేమ, బౌద్ధనగర్ డివిజన్ కార్పొరేటర్ కంది శైలజ, నాయకులు బండ చంద్రారెడ్డి, రాచమల్లకృష్ణమూర్తి, కందాడి నాగేశ్రెడ్డి, కందినారాయణ, కరాటే రాజు, గరిగపాటి చంద్రశేఖర్లు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు బండి లక్ష్మణ్,రాజేశ్, నాగులూరిశ్రీనివాస్గౌడ్, సంజయ్, రాంపల్లిసత్యంగౌడ్, నర్సింగ్గౌడ్, శ్రీశైలం యాదవ్, రవి, మల్లేశ్, శ్రీనివాస్సాగర్, తదితరులు భక్తులకు పలు సేవలు అందించారు.
ఆలయాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తును ఏర్పాటు చేశామని చిలకలగూడ సీఐ సిరికొండ మట్టంరాజు తెలిపారు. రెజిమెంటల్బజార్లోని పాండు రంగ విఠలేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ఈఓ సత్యనారాయణ నాయుడు ఆధ్వర్యంలో వైకుంఠ ఏకదశి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. లాస్యనందిత కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. శివాజీనగర్లోని శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ ఆలయంలో పూజలు జరిగాయి. కార్పొరేటర్ కొంతం దీపిక స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ వై. నర్సారెడ్డి, ఈఓ సత్యమూర్తిలు భక్తులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక ప్రసాద కౌంటర్లు, క్యూ లైన్ల ద్వారా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.