MLA Vivekananda | దుండిగల్, ఏప్రిల్ 6: మల్కాజిగిరి పార్లమెంటరీ స్థానం పొలిటికల్ నిరుద్యోగులకు అడ్డాగా మారిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శనివారం ప్రగతినగర్లోని శ్రీకృష్ణాగార్డెన్స్లో నిజాంపేట్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వాకలపూడి రంగరాయప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశానికి మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి ఎమ్మెల్యే వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన పదేండ్ల కాలంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి.. బీఆర్ఎస్కు ఓటువేసేలా ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత కార్యకర్తలు, నేతలపైనే ఉందన్నారు. స్థానికుడు రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించుకునేందుకు ఇంటింటికీ తిరిగి ప్రచారాన్ని ముమ్మురం చేయాలని సూచించారు.
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు స్థానికులను కాకుండా ఎక్కడి నుంచో అభ్యర్థులను తీసుకొచ్చి ఇక్కడ పోటీకి పెట్టారని, వారు ఎప్పుడు అందుబాటులో ఉండరనే విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు కూలుతుందో ఎవరికీ తెలియదన్నారు. సమావేశంలో నిజాంపేట్ డిఫ్యూటీ మేయర్ ధన్రాజుయాదవ్, కార్పొరేటర్లు మేకల వెంకటేశం, బాలాజీనాయక్ తదితరులు పాల్గొన్నారు.