కాచిగూడ,జనవరి 23: స్థానికుల సహాకారంతో నియోజకవర్గంలోని డివిజన్ల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెలుతున్నట్లు అంబర్పేట(Amberpet) ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్(MLA Venkatesh) అన్నారు. కాచిగూడ డివిజన్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి మంగళవారం మౌలానా ఆజాద్నగర్, తదితర ప్రాంతాల్లో జలమండలి అధికారులతో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పాదయాత్ర నిర్వహించారు.
గత కొన్నేళ్లుగా డ్రైనేజీ సమస్య తలేత్తుతుందని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే డ్రైనేజీ సమస్య తలేత్తకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను అభివృద్ధిచేస్తూ, మౌలిక సదుపాయలు కల్పించేందుకు బాధ్యతగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలను సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.
బస్తీలో ఉన్న సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికై కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి డీజీఎం సన్యాసిరావు, మేనేజర్ షాకీర్, డివిజన్ అధ్యక్షుడు ఎర్ర భీష్మాదేవ్, ఓం ప్రకాశ్యాదవ్, మహేశ్కుమార్, శ్రీకాంత్ ముదిరాజ్, బి.కృష్ణాగౌడ్, నాగేందర్బాబ్జి, భీంరాజ్, తదితరులు పాల్గొన్నారు.