హైదరాబాద్ : కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజలకు ఏం చేశాయో చెప్పాకే ఓట్లు అడగాలని సనత్నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు. సోమవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం బీఆర్ఎస్( BRS) సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా ఎన్నికల ప్రచార రథాలను(Election campaign) జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించిందన్నారు.
క్రిస్మస్, రంజాన్ పండుగలను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం విస్మరించిందన్నారు. ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు కావాలి కానీ వారి బాగోగులు మాత్రం పట్టింకోరా అని ప్రశ్నించారు. ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పేందుకు వందకు పైగా ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏం చేశాయో చెప్పగలరా? అని నిలదీశారు. నిరంతరం ప్రజల మధ్య ఉండే పద్మారావు గౌడ్ గెలుపు ఖాయమన్నారు.