Talasani Srinivas Yadav | కంటోన్మెంట్, మే 2: కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత గెలుపు ఖాయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం బోయిన్పల్లిలోని పార్టీ కార్యాలయంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి జి.నివేదిత, బోర్డు మాజీ సభ్యులు, బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఎన్నికల ప్రచార సరళిపై ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు.
ప్రచారంలో ప్రజలకు ఏ విధంగా చేరువ కావాలో, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, ముఖ్యంగా కంటోన్మెంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ.. ప్రజలను ఓట్లు అడగాలని సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కంటోన్మెంట్తో దివంగత ఎమ్మెల్యే సాయన్నకు 30ఏళ్ల అనుబంధం ఉన్నదని, నియోజకవర్గ ప్రజలందరూ సాయన్న కుటుంబ సభ్యులేనని అన్నారు.
సాయన్న బిడ్డ అయిన నివేదితకు ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారని, ప్రచారంలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. ఏడాది కాలంలోనే తండ్రిని, చెల్లిని కోల్పోయిన అభ్యర్థి నివేదితకు ప్రజలందరూ దీవెనలు అందించాలని కోరారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ సహకారంతో కంటోన్మెంట్లో సాయన్న ఎన్నో అభివృద్ధి కార్యాక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. కంటోన్మెంట్ ఏరియా రక్షణ శాఖ ఆధీనంలో ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలు అమలు అయ్యేలా చొరవ చూపారని గుర్తు చేశారు. సాయన్న బిడ్డ నివేదితను కడుపులో పెట్టుకొని కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపైన ఉన్నదని అన్నారు.
నివేదిత గెలుపు కోసం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి, ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్రెడ్డిలు ఎంతో కృషి చేస్తున్నారని అభినందించారు. కంటోన్మెంట్లో ఇతర పార్టీలకు స్థానం లేదని తలసాని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు క్యాడర్ లేదని చురకలంటించారు. ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ కే బూమ్రాంగ్ అవుతాయని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ కంటోన్మెంట్కు మాత్రం పైస లాభం లేదని మండిపడ్డారు. రోజుకో పార్టీ, పూటకో కండువా మార్చే నాయకులను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తలసాని స్పష్టం చేశారు.
మల్కాజిగిరి ఎంపీగా రాగిడి లక్ష్మారెడ్డి విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీ అభ్యర్థులిద్దరు నాన్ లోకల్ అని, లోకల్ అయిన రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు ఖాయమన్నారు. మరో వైపు సోషల్ మీడియా ఇన్చార్జి మన్నె క్రిశాంక్ అరెస్టును ఆయన ఖండించారు. నకిలీ ఫిర్యాదులతో అరెస్టు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు అనితాప్రభాకర్, నళిని కిరణ్, పాండుయాదవ్, లోకనాథం, భాగ్యశ్రీ, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, నాయకులు టీఎన్.శ్రీనివాస్, ఆకుల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.