అమీర్పేట్, జూన్ 20 : నిర్ధిష్టమైన ప్రణాళిక లేకుండా జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేసిన కాంగ్రెస్ సర్కార్ అసమర్థ పని తీరుతో ప్రజలు విసిగిపోయారని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. పాలన చేతగాని కాంగ్రెస్ రెండున్నరేండ్ల కాలంలో ప్రజల సహనాన్ని పరీక్షించిందన్నారు. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతటి నీటి ఎద్దడిని ప్రజలు ఈ సంవత్సరం చవిచూశారని, విద్యుత్ సమస్యలు ప్రజల ప్రాణాలను బలిగొంటోందని విమర్శించారు.
సనత్నగర్ ప్రజల దాహార్తిని తీర్చేందుకు వీలుగా ఇక్కడ 5ఎంఎల్ రిజార్వయర్ నిర్మాణాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తే, దానిని సద్వినియోగం చేసుకోలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. సనత్నగర్ ఎస్ఆర్టీలోని ఆయుర్వేద పార్కును ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం సందర్శించి కొత్తగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ పరికరాలను పరిశీలించారు. పార్కు నిర్వహణ అధ్వానంగా మారిందని స్థానికులు ఎమ్మెల్యే తలసానికి ఫిర్యాదు చేశారు.
పార్కులో నడకదారి పూర్తిగా శిథిలమైందని, ఇక్కడి లైట్లు కూడా వెలగడం లేదని, సందర్శకుల తాకిడి పెరగడంతో ఇక్కడ టాయ్లెట్ల నిర్మాణాలు కూడా చేపట్టాలని స్థానికులు ఎమ్మెల్యే తలసాని దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే తలసాని పార్కులో మొరం మట్టితో వాకింగ్ పాత్ ఏర్పాటు చేయాలని, దీంతో పాటు స్థానికులు కోరుతున్న వసతులు కూడా కల్పించేలా తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పార్కులో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి మొత్తం రూ. 29 లక్షల వ్యయం కాగల పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని జీహెచ్ఎంసీ అధికారులు ఎమ్మెల్యే తలసాని దృష్టికి తీసుకురాగా, వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి నిధులు విడుదలయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.
15 రోజుల్లో పార్కులోని సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో జలమండలి డీజీఎం ఆశిష్, ఏఈ జమీల్, హార్టికల్చర్ అధికారి రోహిత్, బీఆర్ఎస్ సనత్నగర్ అధ్యక్షులు కొలను బాల్రెడ్డి, వి.కరుణాకర్రెడ్డి, శేషగిరిరావు, ఖలీల్, శ్రీనివాస్రెడ్డి, ప్రకాష్గౌడ్, ఉప్పల యాదగిరి, పార్క్ కమిటీ అధ్యక్షులు రఘురామ్, సనత్నగర్ పరిరక్షణ కమిటీ ప్రతినిధులు ఆకూరి శ్రీనివాస్రావు, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.