ఎల్బీనగర్ , ఏప్రిల్ 12: ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని, ప్రజల సమస్యలు తీర్చని ఈ ప్రభుత్వంపై భవిష్యత్లో ప్రజలే తిరుగుబాటు చేస్తారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని లింగోజిగూడ, చంపాపేట, హస్తినాపురం డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి ఎమ్మెల్యే సుధీర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధీర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల్లో చేతగాని హామీలు ఇచ్చి అమలు చేయకుండా కాలం గడుపుతోందన్నారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ర్టాంలో మంచినీరు, కరెంటు నిరాటంకంగా సరఫరా జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కరెంటు, మంచినీటి కష్టాలు తెచ్చిందన్నారు. మల్కాజిగిరి పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీల కంటే బలంగా ఉందని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీని అందించాలన్నారు. ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గంలో శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు.
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మల్కాజిగిరి పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ గెలుపును ఎవ్వరూ ఆపలేరన్నారు. తాను స్థానికుడినని, అందుబాటులో ఉండి సేవలు అందిస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ముద్రబోయిన శ్రీనివాస్రావు, రమావత్ పద్మానాయక్, సీనియర్ నాయకుడు గజ్జల మధుసూదన్రెడ్డి, సుంకోజు కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.