మన్సూరాబాద్ ( హైదరాబాద్) : తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో చేపట్టిన ఎస్ఎన్డీపీ పనుల వల్ల ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో వరద ముంపు సమస్య తీరిందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి (Mla Devireddy Sudeer reddy) పేర్కొన్నారు. శనివారం నాగోల్ డివిజన్ బండ్లగూడ పరిధి అయ్యప్పకాలనీలో వర్షాల వలన తలెత్తిన మురుగు, వరదనీటి సమస్యలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన డ్రైనేజీ వ్యవస్థల వలన వర్షా కాలంలో కాలనీల్లో మురుగునీటి సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. వరదనీరు డ్రైనేజీ లైన్లలో కలవడం వలన అయ్యప్పకాలనీలో మురుగునీటి సమస్య తలెత్తిందని అన్నారు. గతంలో చిన్నపాటి వర్షాలకే కాలనీలోని ఇండ్లలోకి వరదనీరు చేరేదని తెలిపారు.
సీఎం కేసీఆర్ (CM KCR) , పురపాలక శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR ) ప్రత్యేక శ్రద్ధతో ఇటీవల కాలంలో చేపట్టిన ఎస్ఎన్డీపీ(SNDP) పనుల వలన ప్రజలకు వరద ముంపు సమస్య నుంచి విముక్తి లభించిందని వెల్లడించారు. భారీ వర్షాలు కురిసినా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
అధికార యంత్రాగం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సేవలందిస్తుందని అన్నారు. అయ్యప్పకాలనీ సమస్యల పట్ల తనకు అవగాహన ఉందని దశలవారిగా ప్రజా సమస్యలను పరిష్కరింపజేస్తానని తెలిపారు. ఆయన వెంట నాయకులు అనంతుల రాజిరెడ్డి, తూర్పాటి చిరంజీవి, నాయకులు సతీష్, రమేష్, నర్సింహాచారి, గౌరి, వెంకట్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.