హయత్నగర్, ఏప్రిల్ 1: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని పాతాళానికి తొక్కాల్సిన సమయం ఆసన్నమైందని, బీఆర్ఎస్ వచ్చిందే ఆ పార్టీని బొందపెట్టడానికని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శనివారం హయత్నగర్లోని స్వామి శంకర్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ హయత్నగర్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్గౌడ్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్గుప్తా హాజరయ్యారు. ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లుగా కఠోరంగా శ్రమించి అన్ని వర్గాలకు న్యాయం చేకూరుస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ర్టానికి 14 రంగాల్లో దేశంలోనే 5వ స్థానం లభించిందని, రానున్న ఐదేండ్లలో మొదటి స్థానం వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
దూసుకుపోతున్న ఎల్బీనగర్
ఎల్బీనగర్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్తున్నట్లు ఎమ్మెల్యే సుధీర్రెడ్డి అన్నారు. టిమ్స్ ఆస్పత్రి నిర్మాణం, ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, ఆక్సిజన్ పార్కు, అత్యాధునిక వసతులతో శ్మశాన వాటిక, స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు, కాలనీల్లో పార్కుల అభివృద్ధి, ఎస్ఎన్డీపీ, ఎస్ఆర్డీపీ వంటి అభివృద్ధి పనులు శరవేగంగా జరిగాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని, అయినా సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తున్నదని ఎమ్మెల్యే వివరించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ర్టాలకు మెడికల్ కాలేజీలు, నవోదయ స్కూళ్లను కేటాయించిందని, తెలంగాణకు ఏ ఒక్కటీ కేటాయించిన దాఖలాలు లేవని ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో మెట్రో రైలుకు కూడా నిధులు కేటాయించకుండా కేంద్రం వివక్ష చూపుతున్నదన్నారు.
ఎల్బీనగర్ అభివృద్ధికి 3 వేల కోట్ల నిధులు..
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్తో చర్చించి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఎల్బీనగర్ అభివృద్ధికి రూ.3వేల కోట్ల నిధులను తీసుకొచ్చారని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా చెప్పారు. జాబ్మేళా నిర్వహించి సుమారు 9వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. 15వేల మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. 58, 59 జీవోల కింద నియోజకవర్గంలో దాదాపు 2వేల మందికి ఇండ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో హయత్నగర్ మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ జనరల్ సెక్రటరీ యానాల కృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షుడు గుడాల మల్లేశ్ ముదిరాజ్, సీనియర్ నాయకులు ముత్యాల చంద్రశేఖర్రావు, భాస్కర్ సాగర్, దీపావళి శ్రావణ్కుమార్, బోడ భిక్షపతి, రవీందర్గౌడ్, దర్శన్, కాటెపాక స్కైలాబ్, మహిళా అధ్యక్షురాలు అంజలిగౌడ్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహ్మద్ రఫీక్, బీసీ సెల్ అధ్యక్షుడు గడ్డం బాలకృష్ణ, సీనియర్ నేతలు చెన్నగోని రవీందర్గౌడ్, దేవ ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.