సికింద్రాబాద్, అక్టోబర్ 26: తెలంగాణలో మరో 20 ఏండ్లు టీఆర్ఎస్సే అధికారంలో ఉంటుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ బాగుంటేనే మనం బాగుంటామని, మనం బాగుండాలంటే పార్టీని పటిష్టం చేయాలని సూచించారు.
వచ్చే నెల 15న వరంగల్లో జరిగే పార్టీ విజయ గర్జన సభను విజయవంతం చేసే విధంగా కార్యాచరణను రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా బుధవారం బాలంరాయిలోని రాయల్ లీ ప్యాలెస్లో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ఎనిమిది వార్డుల్లో ఉన్న కార్యకర్తలు, వార్డు అధ్యక్షులు, బోర్డు మాజీ సభ్యులు ఈ సమావేశానికి తప్పక హాజరుకావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
పదవులు రాని వారు బాధపడాల్సిన అవసరం లేదని, పార్టీ అధిష్ఠానం కార్యకర్తల కష్టాన్ని గుర్తిస్తుందన్నారు. సరైన సమయంలో పదవులు కట్టబెడుతుందన్నారు. నియోజకవర్గం నుంచి పది వేల మంది కార్యకర్తలు విజయగర్జన సభకు తరలివచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లాస్య నందితా, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, నేతలు నివేదిత, తేజ్పాల్, పనస సంతోష్, ముప్పిడి మధుకర్, సదానంద్గౌడ్, నరేశ్, అజయ్, లతామహేందర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.