మియాపూర్ , మార్చి 30: సీఎం కేసీఆర్ పాలనలో విశేష ప్రగతితో నియోజకవర్గాలన్నీ పురోగతిని సాధించాయని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల హామీలను ఏమాత్రం అమలు చేయడం లేదని, కేవలం బీఆర్ఎస్ను బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నదన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం శనివారం మియాపూర్లో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో జరిగింది.
చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి జ్ఞానేశ్వర్ సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడని.. బీసీ గొంతుకను అధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని కోరారు. అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని, అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేశారన్నారు. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లాడుతూ గడచిన రెండు పర్యాయాలు చేవెళ్ల గడ్డపై గులాబీ జెండా ఎగిరిందని, ప్రజల మద్దతుతో హ్యాట్రిక్ను సాధించి తీరుతామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, హమీద్ పటేల్, జూపల్లి సత్యనారాయణ, నార్నె శ్రీనివాస్రావు, ఉప్పలపాటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.