బండ్లగూడ, జనవరి 23: మేయర్ మహేందర్ గౌడ్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకుని ప్రజల సమస్య పరిష్కారం వైపు దృష్టిని కేంద్రీకరించాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పేర్కొన్నారు. ఇటీవల బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహేందర్ గౌడ్పై డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటిస్తూ కలెక్టర్ శశాంకకు నోటీసు అందజేసిన విషయం తెలిసిందే. వారం పది రోజులుగా అవిశ్వాస తీర్మానం చేసిన వారంతా క్యాంపులో ఉన్నారు. మేయర్ మహేందర్ గౌడ్ ఈ విషయాన్ని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ దృష్టికి తీసువెళ్లారు. దీంతో ఆయన మంగళవారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేయర్ మహేందర్ గౌడ్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాలుగేండ్లుగా కార్పొరేషన్ అభివృద్ధికి మేయర్ మహేందర్ గౌడ్తో పాటు తాను నిరంతరం కృషి చేశామన్నారు. మేయర్ మహేందర్ గౌడ్ చేసిన తప్పులను చూపించాలని తెలిపారు.
అవిశ్వాసం పేరుతో కాలయాపన చేయొద్దని హెచ్చరించారు. మేయర్ మహేందర్ గౌడ్ తప్పు చేసుంటే ప్రజలలో ఉండి తేల్చుకోవాలని, లేదా తమ దృష్టికి తీసుకు వస్తే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. తమపై ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రజలకు మోసం చేస్తే అభివృద్ధి కుంటు పడుతుందని తెలిపారు. వెంటనే అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకుని ప్రజల సమస్య పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ మహేందర్ గౌడ్, కార్పొరేటర్లు శ్రీలతా సురేష్ గౌడ్, పద్మావతి పాపయ్య యాదవ్, సాగర్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ రాందాస్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింహ, బీజేఎంసీ బీఆర్ఎస్ అధ్యక్షుడు సురేష్ గౌడ్, యువజన విభాగం అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, నాయకులు పాపయ్య, అంతరం, నరేష్, రాజు, జగదీష్, విష్ణువర్దన్ రెడ్డి, వెంకటేష్, రాజు, సుమన్ గౌడ్, సుందర్ గౌడ్, రాముడు యాదవ్ పాల్గొన్నారు.