వనస్థలిపురం, జనవరి 23 : ప్రజా సమస్యల పరిష్కారానికి కాలనీల్లో మార్నింగ్ వాక్ వారధిగా నిలిచిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ‘సూర్యుడికంటే ముందే సూధీరన్న’ పేరుతో 1987 జనవరి 23న కాలనీల్లో మార్నింగ్ కార్యక్రమం చేపట్టి 35ఏండ్లు పూర్తియింది. ఈ సందర్భంగా సోమవారం తెల్లవారుజామున హస్తినాపురం డివిజన్లో పర్యటించారు. అనంతరం సత్యదేవ్ కాలనీలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మార్నింగ్ వాక్ కార్యక్రమం ఎంతో ఉపయోగపడిందన్నారు. 35ఏండ్లుగా వేల కిలోమీట్లు పాదయాత్ర చేసి ప్రజలను నేరుగా కలుసుకోవడంతోపాటు, సమస్యలను గుర్తించడం చేశామన్నారు.
దాదాపు నియోజకవర్గంలోని అన్ని కాలనీల్లో చేశామన్నారు. ఎల్బీనగర్ సంపూర్ణ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. హుడా చైర్మన్గా, ఎమ్మెల్యేగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ లక్ష్యం దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రజా ధనం వృథా కాకుండా అభివృద్ధి చేయడం తమ విధానమన్నారు. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్, పురపాలక మంత్రి కేటీఆర్ల సహకారం ఎంతో ఉందన్నారు.
35ఏండ్ల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమానికి సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. శివారు కాలనీలో ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందని, అందుకు అనుగుణంగగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అందోజు సత్యం చారి, సీనియర్ నాయకులు గజ్జెల మధుసూదన్రెడ్డి, గోపిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, శ్రీనివాస్నాయక్, శ్రీనివాస్ యాదవ్, ఉదయ్రెడ్డి, భిక్షపతి, నాగిరెడ్డి, సయ్యద్ పాషా, రోహిత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.