బంజారాహిల్స్, డిసెంబర్ 10 : పేదల మేలు కోసం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Nagender) అన్నారు. మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) కింద మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకాన్ని, ఆరోగ్యశ్రీ పథకం పరిధిని రూ.10లక్షల పెంపు పథకాన్ని ఆదివారం బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీటీనగర్లో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆర్థిక భారం తగ్గుతుందని, ఆరోగ్యశ్రీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మిగిలిన అన్ని హామీలను కొత్త ప్రభుత్వం త్వరితగతిన నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతరం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, హిమాయత్నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్గౌడ్, ఖైరతాబాద్ కార్పొరేటర్ పి.విజయారెడ్డితో కలిసి ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆర్టీసీ బస్సులో కొంతదూరం ప్రయాణించి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమశాఖ అదనపు డైరెక్టర్ రాజేందర్, డీఎమ్ఓహెచ్ డా.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.